(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
” చిత్తశుద్ధితో ఎటువంటి లాభపేక్ష లేకుండా సేవ చేసినప్పుడు ఫలితం దానంతట అదే వస్తుంది.” విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్లాల్ తరచూ చెప్పే మాట ఇది. ఇప్పుడు అదే నిజమైంది. కేంద్ర జల్శక్తి శాఖ 2019 సంవత్సరానికి గానూ అందించిన జలశక్తి పురస్కారం ఆకాంక్షిత జిల్లాల విభాగంలో విజయనగరం జిల్లాను వరించింది. ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను దక్కించుకున్న విజయనగరం సిగలో మరో కలికితురాయి.
దశదిశలా విజయనగరం కీర్తి
ఈ అవార్డుతో విజయనగరం కీర్తి మరోమారు దశ దిశలా వ్యాప్తి చెందింది. డొనేట్ రెడ్ (రక్త దానం), స్ప్రెడ్ గ్రీన్ (పచ్చదనం), సేవ్ బ్లూ (జల సంరక్షణ) నినాదంతో ముందుకు వెళ్తున్న జిల్లా కలెక్టర్.. జిల్లాలో ‘చెరువుల శుద్ధి- పచ్చదనం పెంపు’ను ఒక ఉద్యమంగా చేపట్టారు. ఆ కృషికి ఇప్పుడు పురస్కారం లభించింది. ఇది ఏ ఒక్క రోజులోనో, ఏ ఒక్కరివల్లో సాధ్యమైనది కాదు. ఎన్నో రోజుల కృషి ఫలితంగా, వేలాది మంది శ్రమ శక్తికి ప్రతిఫలంగా లభించింది.
వెనుకబడిన జిల్లా
విజయనగరం పూర్తిగా వెనుకబడిన జిల్లా. ఇక్కడ నీటి వనరుల లభ్యత కూడా తక్కువే. 70 శాతం పంటలకు వర్షాధారమే దిక్కు. వనరులున్నా సద్వినియోగం చేసుకోలేకపోవడం ప్రధాన లోపం. ఫలితంగా ఏటా కరవు ఛాయలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని ‘మన ఊరు- మన చెరువు’ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు జిల్లా కలెక్టర్. గతేడాది వేసవిలో విజయనగరంలో పెద్ద చెరువు శుద్ధి సేవతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఆ స్ఫూర్తి దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతోంది. జిల్లాలో 9,433 చెరువులు ఉండగా, ఇందులో దాదాపు 4 వేలకు పైగా చెరువులను బాగు చేశారు. విజయనగరంలోనే 22 చెరువుల చుట్టూ గట్లను చదును చేసి మొక్కలు నాటారు. వాకింగ్ ట్రాక్లు తీర్చిదిద్దారు. ఇలా నందన వనాలుగా రూపుదిద్దుకున్న చెరువులు అనేకం. జిల్లా కేంద్రంలోని అయ్యకోనేరు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
ఉప్పొంగిన భూగర్భ జలాలు
జల వనరుల పరిరక్షణ పౌరులందరి బాధ్యత అని కలెక్టర్ పిలుపునివ్వడంతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు, పోలీసులు వేలాదిగా కదిలారు. ఆయనే తెల్లవారు జామున 5 గంటల కల్లా చెరువుల శుద్ధిలో భాగస్వాములు అయ్యేవారు. అందరి శ్రమ వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలమట్టాలు పెరిగేందుకు దోహదపడింది. సాగు, తాగునీటి వనరుల లభ్యత పెరిగింది. అన్నింటికీ మించి ఆ ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. గతేడాది కంటే ఈ ఏడాది 1.19 మీటర్ల ఎగువన భూగర్భ జలాలు ఉండటం సమష్టి కృషి ఫలితమని చెప్పాలి.
బాధ్యతను పెంచిన పురస్కారం
ఈ పురస్కారం జిల్లా అధికారుల బాధ్యతను మరింత పెంచింది. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వనరుల సంరక్షణ ఉద్యమం మున్ముందూ కొనసాగించాలి. జిల్లాలో ఉన్న మిగిలిన 4 వేల చెరువులనూ బాగు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వాటిలో చెత్తా చెదారాలు, ఇతర వ్యర్థాలు వేయకుండా స్థానికులే కాపాడుకోవాలి.
వర్చువల్ విధానంలో ..
ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయనగరం జిల్లాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సామాజిక న్యాయశాఖ మంత్రి రతన్లాల్ కఠారియా, జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలెక్టర్ హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్లు జీసీ కిశోర్కుమార్, జె.వెంకటరావు, వివిధ శాఖల అధికారులు వీక్షించారు.
ప్రజలకు అంకితం : కలెక్టర్
ఒక ఉద్యమ స్ఫూరితో, ప్రణాళికా బద్ధంగా, సమష్టిగా ముందడుగు వేశామని, దాని ఫలితమే ఈ పురస్కారమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఒకరిని చూసి మరొకరు అందరూ కలిసి రావాలన్నారు. ప్రతి మండలంలోనూ ఈ ఉద్యమం కొనసాగాలని, ఇది ఇక్కడితో ఆగిపోదని చెప్పారు. నీటి కుంటల ఏర్పాటు, చెరువుల శుద్ధి, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ఈ పురస్కారం జిల్లా ప్రజలకు అంకితం ఇస్తున్నానని స్పష్టం చేశారు.











