అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం.. విశాఖలో ఆ పార్టీకి ముందు ముందు గడ్డు పరిస్థితుల్ని సృష్టించబోతున్నాయా? విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే కాదు.. స్థానికంగా పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ సీపీలో చేరడం ఇందుకు నిదర్శనమే.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపుకార్యాలయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గంటా స్పందన ఏంటి?
పంచకర్ల రమేష్ బాబు , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుంగు సహచరుడు. ఆయన ప్రేరణతోనే వైకాపాలోకి వెళ్లినట్టుగా ఒక ప్రచారం ఉంది. అయితే గంటా చేరికను బలంగా అడ్డుకుంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా వర్గ బలాన్ని కూడా దెబ్బకొట్టడానికి, ఆయన అనుచరుడు మాత్రం పార్టీలో చేరేలా చక్రం తిప్పారనే వాదన కూడా ఉంది. గంటా చేరిక విషయంలో ముహూర్తాలు అనేకం వచ్చినా.. ఇంకా ఖరారు కాలేదు.
జగన్ ను ఆకాశానికెత్తేసిన పంచకర్ల
ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ఓ సుదినం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నేను వైస్సార్సీపీలో జాయిన్ అయ్యాను. 5 నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసాను…జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశాను. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఉత్తరాంధ్రను పరిపాలన రాజధాని చేస్తాను ఆంటే వ్యతిరేకించాడు. మూడు రాజధానులు వద్దని ఆందోళన చేయాల్సిందిగా మెసేజ్ పెడుతున్నారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా మసులుకోలేక టీడీపీ వీడాం. వైఎస్సార్సీపీ కి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. ప్రతిరోజూ జగన్ ని తిట్టమనడం తట్టుకోలేక బయటకు వచ్చాం’’ అన్నారు.
జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు. ‘‘అట్టడుగు వర్గాలకు 60 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రజలంతా బ్రహ్మ రథం పడుతుంటే ఆయనకు మద్దతు పలకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ప్రజలకు నేనున్నానని విపత్తుల సమయంలో జగన్ ఆదుకున్నారు. జూమ్ అని మీటింగ్ పెట్టి విమర్శలకు దిగుతుంటే చాలా మంది నాయకులు దాంట్లోకి రావడం లేదు. ఇంకా చాలా మంది వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. చివరకు ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టాలన్నా కోర్ట్ కేసులతో అడ్డుకుంటున్నారు. ఎందుకు ఒడిపోయామని పోస్ట్ మార్టం చేసుకోకుండా చేప్పుడు మాటలు వింటూనే ఉన్నారు. ఇక ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు.’’ అని విమర్శించారు.
చాలెంజ్ విసిరిన అవంతి
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబునాయుడుకు చాలెంజ్ విసిరారు. ‘‘మీరు ఆన్లైన్ పోల్ పెట్టడం కాదు… నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని నా ఛాలెంజ్ విసురుతున్నా. రాష్ట్రంలోని 87 శాతం ప్రజల మన్ననలు పొందిన నేత వైఎస్ జగన్. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు. ఇక్కడేమో 33 వేళా ఎకరాల్లో భవనాలు కడతానన్న బాబు…అక్కడ చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోడాన్ని అడ్డుకుంటున్నారు. 23 కోట్ల రూపాయలు చంద్రబాబు, ఆయన కుమారుడు విశాఖలో ప్రైవేట్ హోటల్స్ కి బిల్లులు చెల్లించారు. అంటే విశాఖపట్నం ఇక అభివృద్ధి చెందకూడదా…?. కొన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆపగలరు.’’ అంటూ వ్యాఖ్యానించారు.
రమేష్ బాబుకు సముచితస్థానం : విజయసాయి
రమేష్ బాబు సేవలు తప్పనిసరిగా వినియోగించుకుంటామని, ఆయనకు సముచిత స్థానం ఇస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు కుల తత్వవాది… పాలన రాజధాని విశాఖకు అనేది పూర్తిగా చట్టసభలకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కు. ఎన్ని అడ్డంకులు వచ్చినా న్యాయం జరుగుతుంది… సీఎం 15 నెలలుగా చేస్తున్న పరిపాలన చూస్తే అన్ని వర్గాలకు న్యాయం చేశారు. 14 ఎళ్ల చంద్రబాబు హయాంలో బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ న్యాయం జరిగింది..?’’ అంటూ విజయసాయి ప్రశ్నించారు.