(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఉత్సాహవంతులకు , యువతకు పెద్దపీట వేస్తూ కొత్తరక్తం ఎక్కించే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టడం, ప్రస్తుతం ఉన్న పార్టీ అధ్యక్షులను మార్పు గురించి మాటమాత్రానికైనా చెప్పకపోవడం, నాయకులను సంప్రదించకపోవడం, ఆశావహులను బుజ్జగించకపోవడం తదితర కారణాల వల్ల నూతన అధ్యక్షుల నియామకాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అరకు ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షురాలిగా సాలూరుకు చెందిన గుమ్మడి సంధ్యారాణిని ఆ పార్టీ నియమించింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న ఆమె స్వతహాగా ఉత్సాహవంతురాలు, విద్యాధికురాలు. అంతేకాకుండా గత సాధారణ ఎన్నికల్లో సాలూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ ఆశించి భంగపడినప్పటికీ అధినాయకునిపై విశ్వాసంతో పార్టీలోనే కొనసాగుతుండటం వల్ల అధ్యక్షురాలిగా అవకాశం లభించిందనే విషయంలో సందేహించాల్సిన అవసరంలేదు.
టీడీపీ రెబల్ గా ముద్ర
సంధ్యారాణి రాజకీయ ఆరంగేట్రం 1999 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జరిగింది. ప్రస్తుతమంత్రి బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో ఎమ్మెల్యే టికెట్ సంపాదించి టీడీపీ అభ్యర్థి భంజదేవ్తో పోటీపడి ఓటమిపాలయ్యారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సాలూరు నుండి మరోమారు టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి వైసీపీ అభ్యర్థి రాజన్నదొరతో తలపడి ఓటమిపాలయ్యారు. అప్పటినుండి టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పూర్వ ప్రత్యర్థి భంజదేవ్ కు ఈమెకు మధ్య వైషమ్యాలు కొనసాగుతునే ఉన్నాయి. అందువల్ల ఈమెపై టీడీపీ రెబల్గా ముద్ర ఉంది. ఈ పరిస్థితుల్లో ఈమెకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం వల్ల ప్రత్యర్థి వర్గాలు ససేమిరా అంటున్నాయి.
కేడర్ లేమి
సంధ్యారాణికి స్వతఃసిద్ధమైన కేడర్ అంటూ ఏమీలేదు. పార్టీ అధినాయకునితో ఉన్న సత్ససంబంధాలే తప్ప తన సొంత నియోజకవర్గంలో నాయకులతోగాని, కేడర్తో గాని చెప్పుకోదగ్గ సంబంధాలు లేవు. ఇక పక్క నియోజకవర్గాల కేడర్తో సంబంధాలు గురించి ఆలోచించాల్సిన అవసరమేలేదు. అటువంటి వ్యక్తిని ఏ ప్రాతిపదికన పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందువల్ల పార్వతీపురం, కురుపాం తదితర నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఈమెను అధ్యక్షురాలిగా అంగీకరించడం లేదు.
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలోనే మూడు ముఠాలు, ఆరుగ్రూపులుగా టీడీపీ పరిస్థితి మారటం పట్ల ఆ పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.