2014 వరకు దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. సంప్రదాయ ప్రచారాలే ఎక్కువగా ఉండేవి. సభలు ఎక్కువగా ఉండేవి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంది. అది ప్రశాంత్ కిషోర్ వ్యూహమా..లేకపోతే గుజరాత్ తో బీజేపీ అనుసరించిన మార్గమా అనే విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా ద్వారా యువతను తమవైపు ఎలా తిప్పుకోవచ్చో బీజేపీ రుజువు చేసింది. అందులో ఎన్ని ఫేక్ అకౌంట్ లు ఉన్నాయి.. ఆ ప్రచారంలో వాస్తవికత ఎంత అనే విషయం కంటే..గెలిచామా లేదా అనేదే ఎన్నికల్లో ప్రాధాన్య అంశం కాబట్టి.. పార్టీలన్నీ అదే మార్గంలో వెళ్లడం ప్రారంభించాయి. ఫేస్ బుక్ లో పార్టీలు, సానుభూతిపరులు, అభిమానులు, సైన్యాలు.. ఫోర్స్ లు, ఆర్మీలు..ఇలా ప్రత్యేక పేజీలు మొదలయ్యాయి. ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ ..ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపై పార్టీలు ఆధారపడడం మొదలైంది. అన్ని పార్టీలూ ఈ బాటలో వెళ్తున్నా..కొన్ని పార్టీలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. ఇక మొన్నటి దుబ్బాక ఎన్నికల వరకు కూడా బీజేపీ సోషల్ మీడియా అన్ని పార్టీలకంటే ముందుంది అని చెప్పవచ్చు. ఇందుకు టీఆర్ఎస్ అభిమానులు చెప్పిన మాట ప్రస్తావించాల్సి ఉంటుంది. తమకు సంబంధించిన సోషల్ మీడియా విభాగాలు.. బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను అడ్డుకోలేకపోయాయి అంటూ, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న కొన్ని ఫేస్ బుక్ పేజీల్లో కామెంట్లూ కనిపించాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూడా సోషల్ మీడియా వార్ మరింత ఎక్కువైంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు, పార్టీలు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఇక ఆయా పార్టీల్లో స్టార్ లీడర్లు క్యాంపెయినర్ల పేజీల్లోనూ ప్రచారం జోరందుకుంది.
ఒక్క ఫొటో దొరికినా..
తమ నాయకుడికి సంబంధించిన పాజిటీవ్ ఫోటో, వీడియో అవ్వచ్చు.. ప్రత్యర్థి పార్టీకి చెందిన నెగెటీవ్ ఫొటో, వీడియో అవ్వచ్చు.. దేన్నీ వదిలకుండా పార్టీలు, నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాస్తవమా.. అవాస్తవమా.. ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా.. అనేది తేలేలోగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు మొన్న వరద బాధితుల సహాయం ఇష్యూలో బండి సంజయ్ పేరిట సర్క్యూలేట్ అయినా లెటర్ హెడ్ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. బండి సంజయ్ పేరుతో ఉన్న లెటర్ హెడ్ అని చెబుతూ కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది ఫేక్ డాక్యుమెంట్ అని, తన సంతకం ఫోర్జీరీ చేశారని బండి సంజయ్ చెబుతున్నారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అది నిజమైనదా.. ఫోర్జరీదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒక వేళ పోర్జరీ చేసి ఉంటే.. బాధ్యులపై పోలీసుల యాక్షన్ తప్పదు. అది వేరే విషయం. కాని ప్రత్యర్థి పార్టీలను డామేజ్ చేసే ప్రచారాలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇక వరదలు, పార్టీలు గతంలో చెప్పిన మాటలు.. ప్రభుత్వ హామీలు.. వరద బాధితుల ఆందోళనల వీడియోలను ఎవరికి వారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాలుగోస్తంభంగా చెప్పే మీడియా కంటే.. సోషల్ మీడియాలో కనిపించే వార్తలు, సమాచార అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పార్టీలకు సంబంధించిన నిక్ నేమ్ లు కూడా చాలా సర్క్యూలేట్ అవుతున్నాయి. కొన్ని పార్టీలకు సంబంధించిన వారిని ఉద్దేశించి పింకీలు, ఫేకుడు గాళ్లు, 90ML, కమ్మీలు, అంద్ భక్త్, పప్పు, జూటాకోర్..ఇలా పలు పదాలను కూడా ట్యాగ్ చేస్తుండడం కనిపిస్తోంది.
రిక్రూట్మెంట్లు.. కాంట్రాక్టులు..
ప్రచారానికి తక్కువగా సమయం ఉన్న నేపథ్యంలో పార్టీలు నాయకులు వెంటనే రిక్రూట్ మెంట్ లు చేస్తున్నారు. చాలా మంది నాయకులు గత రెండురోజుల్లోనే ఓ కంప్యూటర్, ఓ కంటెంట్ రైటర్, సోషల్ మీడియా మార్కెటింగ్ కాంట్రాక్టర్లను నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సోషల్ మీడియాకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే బైట్ల రూపంలో పబ్లిక్ పల్స్ గా చెప్పే పనికూడా మొదలైంది. ఉదాహరణకు 30 మంది జనాల అభిప్రాయాలు సేకరిస్తే.. అందులో 80శాతం తమకు అనుకూలంగా ఉండేలా చెప్పించాలని కూడా కొన్ని చోట్ల ఒప్పందాలు కుదిరినట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇక తెలంగాణలో ని కొందరు లీడర్లకు ఉన్న ఫాలోవర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి పోస్టులుకూడా ప్రాధాన్యంగా మారాయి. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా 90శాతం యువతలో స్మార్ట్ ఫోన్లు ఉన్న నేపథ్యలో ఎన్నికల చర్చ..బయటికంటే ఫోన్లలోనే ఎక్కువగా నడుస్తుందని చెప్పవచ్చు.