(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ జంబో కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ప్రస్తుత వాతావరణం అంత ఆశావహంగా లేదు. ఉన్న నాయకులు చాలా మంది సైలెంట్ గా ఉండిపోతున్నారు. పార్టీపదవులు ఇస్తాం అంటే తీసుకోడానికి కూడా ముందుకు రావడం లేదు. చాలా జిల్లాల్లో ఇదే వాతావరణం ఉండవచ్చు గానీ.. ఇక్కడ సంకటస్థితిని తెలుగుదేశం ఎదుర్కొంటోంది.
జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డిలు టీడీపీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా పదవులు పొందారు. వీరిద్దరేనా.. ప్రకాశం జిల్లాలో పార్టీకి ఇంకెవ్వరూ నాయకులే లేరా? అనే మీమాంస సహజంగానే ఎవ్వరికైనా ఎదురౌతుంది. అయితే రకరకాల కారణాల రీత్యా పార్టీకి దూరదూరంగా మెలగుతున్నారు.
నిజానికి జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, మరో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మొదటి నుంచి టీడీపీలో ఉన్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. నాయకులకు కొదవ లేకపోయినా.. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది మీమాంస!
దామచర్ల జనార్దన్ తప్పితే ఎవరూ పార్టీలో బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాహుల్ సన్నిహితుడిగా ముద్రపడిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. బాపట్ల ఎంపీ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి 15 రోజులు దాటినా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈనెల 10 వ తేదీన ఆయన బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. దామచర్ల, ఏలూరి తప్ప మిగిలిన నేతలు ఎవ్వరూ పార్టీ భారం మోయడానికి, ముందుకు తీసుకువెళ్లడానికి ముందుకు రానట్లే. 10వ తేదీ బాధ్యతల స్వీకరణ ముహూర్తం కూడా వాయిదా పడితే గనుక ఏలూరి కూడా జై వైసీపీ అనుకోవాల్సిందే.
ఎందుకిలా జరుగుతోంది?
జిల్లాలో తెలుగుదేశానికి ఉన్న బలమైన నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డికి లొంగిపోయారని అనుకోవాలి. బెదిరించారో, బతిమాలారో, వారి వారి లోపాలను అస్త్రాలుగా మార్చి బయటకు తీశారో గానీ.. మొత్తానికి వైఎస్సార్సీపీ అగ్ర నాయకులు.. తెదేపా నేతలను సైలెంట్ గా మార్చగలిగారు.
జిల్లాలోని ముఖ్య నాయకుల్లో ఒకరైన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తన గ్రానైట్ కంపెనీలకు ప్రభుత్వం విధించిన జరిమానాలు కట్టలేక, కేసులు తట్టుకోలేక ఏకంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు సన్నిహితుడిగా కూడా గుర్తింపు ఉన్న నాయకుడు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకే ఒకప్పట్లో కేంద్ర బిందువు, చక్రం తిప్పిన అగ్ర నేత కరణం బలరాం.. చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆ తర్వాత వైఎస్సార్సీపీలోకి జంప్ చేశారు. అప్పటినుంచి ఆయన ఆ పార్టీలో తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో సతమతం అయిపోతున్నారు. చీరాలలో ఆమంచి రాజకీయ దూకుడుకు తట్టుకోలేకపోతున్నారు. తన కొడుకును చీరాలలో భావి నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయాలా? అద్దంకిలో రేపటి నేతగా తీర్చిదిద్దాలా? తేల్చుకోలేక పాట్లు పడుతున్నారు.
గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు విషయానికి వస్తే.. ఆర్థికంగా బలమైన నాయకులే అయినా.. ఇటీవలి కేసుల దెబ్బకు తెలుగుదేశం నాయకులుగా చెలామణీ కావడమే వారికి ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి రకరకాల కారణాల నేపథ్యంలో.. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గతిలేని స్థితి ఏర్పడింది. చిన్న చిన్న పదవులు పొందిన వారంతా అంతగా ప్రభావం చూపలేని నాయకులే కావడం గమనార్హం.