వేల కోట్ల కుబేరుడు పేదల ప్రతినిధా..? పేదలపై జగన్ ప్రేమ పెద్ద జోక్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పదేపదే చేస్తున్న వ్యాఖ్య..‘‘పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం’’గా రేపటి ఎన్నికలను చిత్రించడం..పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా నవ్వులపాలే..ఇంతకన్నా పెద్ద జోక్ మరోటి లేదని, శతాబ్దపు జోక్, మిలీనియం జోక్ గా పరిహాస పాలైంది..
వందల కోట్ల విలువైన ప్యాలెస్ లు 9నగరాల్లో 9 ఉన్నాయని, ఇడుపులపాయలో వేల ఎకరాల ఎస్టేట్, వేల కోట్ల విలువైన సిమెంట్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, మీడియా సంస్థల అధిపతి జగన్మోహన్ రెడ్డి తానేదో పేదల ప్రతినిధి అయినట్లు, పేదలపై ప్రేమ ఒలకపోయడం, ప్రతిపక్షాలను పెత్తందార్ల పార్టీలుగా చిత్రీకరించి రాజకీయలాభాలు పొందాలన్న ఆరాటం అభాసుపాలైంది, మిస్ ఫైర్ అయ్యింది.
ఆయన వేసుకునే చెప్పుల ధర రూ లక్షా 30వేలని, వాడే పెన్ను రూ లక్ష అని, తాగే వాటర్ బాటిల్ రేటు రూ 5వేలని ససాక్ష్యాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు బైటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింతగా నవ్వులపాలు అవుతోంది..
9నగరాల్లో 9ప్యాలెస్ ల చిత్రాలే ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి..బెంగళూరు విమానాశ్రయం దగ్గరలో 23ఎకరాల్లో ఎలహంక ప్యాలెస్ హెలిప్యాడ్ తో పాటు 72గదులు, హోం థియేటర్లు, ఆటస్థలాలతో వందలకోట్ల భవంతిని 60వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వవచ్చనే విమర్శ కూడా అప్పట్లో ఉండేది. హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ అయితే 60వేల చఅడుగుల్లో 60గదులు, 10లిఫ్ట్ లు, 14ఎస్కలేటర్లు, 200సీట్ల థియేటర్ తో ఉంటుందని, 40వేల ఇళ్లకు సమానంగా పేర్కొంటారు. పులివెందులలో ఇంకో ప్యాలెస్, కడపలో మరొకటి, తాడేపల్లిలో 2ఎకరాల్లో మరో ప్యాలెస్, ఇలా 9నగరాల్లో 9అత్యాధునిక భవనాల యజమానిగా జగన్ పేరొందారు.
5రాష్ట్రాల్లో రూ 60వేల కోట్ల విలువైన పవర్ ప్లాంట్లు వీరివే కావడం విశేషం.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో 10వేల మెగావాట్ల పైబడి సామర్ధ్యమున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు విదితమే..సాక్షి మీడియా(జగతి పబ్లికేషన్స్), భారతి సిమెంట్స్ మరో రెండింటి విలువే రూ 10వేల కోట్ల పైబడిగా ప్రతిపక్షాలే చెప్పాయి.
ఇక ఇడుపులపాయ ఎస్టేట్ సంగతి తెలిసిందే. వేల ఎకరాల ఎస్టేట్ లో వందలాది ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ పై వివాదం శాసనసభలో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ప్రకటన దాకా వెళ్లింది. తనకు తెలియకుండా తనతండ్రి రాజారెడ్డి 610ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ కొన్నారని అసెంబ్లీలో చెప్పి, మరుసటిరోజే దాన్ని 300ఎకరాలకు తగ్గించి, ఆ భూములను వాళ్లకే తిరిగి స్వాధీనం చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు. కానీ ఈ రోజుకు వాటిని స్వాధీనం చేయలేదనేది మరో వివాదం..ఆ భూముల్లో కొండలు, గుట్టలు, చెరువులతో పాటు బంజరు, అటవీ భూములను కూడా ఆక్రమించారనేది విమర్శలపాలైంది.
అవినీతి కుంభకోణాలతో జగన్మోహన్ రెడ్డి ఆర్జించిన వేల కోట్ల అక్రమాస్తులపై గత 15ఏళ్లుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ కావడం తెలిసిందే..క్విడ్ ప్రొ కో అనే నయా అవినీతి విధానం సృష్టికర్తగా దేశవిదేశాల్లో జగన్ పేరుమార్మోగడం విదితమే..తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకెంత-నాకెంత అనే ఈ నయా కరప్షన్ ట్రెండ్, సూట్ కేసు కంపెనీలు, హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్ పై సిబిఐ 13, ఈడి 9ఛార్జిషీట్లు, 16నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన వ్యక్తి నోట ఈ వ్యాఖ్యలు విడ్డూరమే..
దేశంలోనే సంపన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఇటీవల అసోసియేట్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడిఆర్) వెల్లడించింది. 29మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తులు కలిపినా జగన్మోహన్ రెడ్డి ఆస్తికన్నా తక్కువేనని బైటపెట్టింది.
2004లో తన ఆస్తి రూ కోటి 74లక్షలని ఇదే జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాంటిది 7ఏళ్లలోనే ఆయన ఆస్తులు 1100% పెరిగాయి. 2014లో రూ 413కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొనగా, తాజా అఫిడవిట్ లో రూ 500కోట్ల పైబడిగా చూపారు.. ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్దమొత్తం ఎలా సంపాదించారని, రూ 10 షేర్ రూ 350కు, రూ 1440కు ఎలా అమ్మారని అప్పట్లోనే సుప్రీంకోర్టు జడ్జి, సిఐడి డైరెక్టర్ ఆశ్చర్యపోయారు కూడా..
ఇన్ని వేలకోట్ల సంపన్నుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానే పేదల పాలిట మెస్సయ్యగా పేర్కొంటూ, తెలుగుదేశం, జనసేన, బిజెపి, కమ్యూనిస్టు పార్టీలన్నీ పెత్తందార్లంటూ రాబోయేది ‘‘పేదలు-పెత్తందార్ల మధ్య యుద్ధం’’ అనడం హాస్యాస్పదమే..
తెలుగుదేశం పార్టీ ఓడిపోతే పేదల సంక్షేమ పథకాలను నిలిపేస్తారనడం ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే..రాష్ట్రంలోగాని, దేశంలోగాని ఇన్నేళ్లలో ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ గత ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములను నిలిపేసిన పాపాన పోలేదు. ఎన్టీఆర్ తెచ్చిన రూ 2కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం వంటి స్కీములను మరింత మెరుగుపరిచి కొనసాగించారే తప్ప ఎవరూ నిలిపేయలేదు. రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజుల చెల్లింపు స్కీములూ అంతే, తర్వాత ప్రభుత్వాలు వాటిని కొనసాగించాయి.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే పేదల వెల్ఫేర్ స్కీముల రద్దు దుస్సంప్రదాయానికి తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన ‘‘అన్నా కేంటిన్ల’’ను మూసేశారు, రంజాన్ తోఫా, క్రిస్ మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుక వంటి పండుగ కానుకలు, పెళ్లి కానుకలన్నీ రద్దు చేశారు. ‘‘చంద్రన్న బీమా’’ నిలిపేశారు, విదేశీవిద్య ఆపేశారు. తానే గత స్కీములను రద్దుచేసి, మళ్లీ తానే గెలవకపోతే ఈ స్కీములు ఉండవని చెప్పడం జగన్ రెడ్డి దుర్రాజకీయాలకు, కుట్రపూరిత ఆలోచనలకు నిదర్శనం..
ప్రజలిచ్చిన మేండేట్ ను జగన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నాడు..4ఏళ్ల పాలనలో అవినీతి-అక్రమాలు, హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు-నిర్బంధాలతో ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాలుచేశారు. ఓటమి భయంతోనే ఈ విధమైన ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాడు. పదేపదే క్లాస్ వార్ అంటూ యుద్ధవాతావరణం పెంచుతున్నాడు. జగన్ ది క్యాస్ట్ వార్, క్యాష్ వార్ తప్ప క్లాస్ వార్ కాదనే భావన సర్వత్రా నెలకొంది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్లు ఇప్పుడుంటే జగన్ రెడ్డి క్లాస్ వార్ మాటలకు బేజారెత్తిపోయేవారని అపహాస్యం చేస్తున్నారు. పోగాలం దాపురించబట్టే ఇలాంటి వ్యాఖ్యలకు, చేష్టలకు బరితెగించారని ధ్వజమెత్తుతున్నారు.











