తిరిగే కాలు.. తిట్టే నోరును ఊరికే ఉండమంటే ఎంత కష్టం. అలాంటి కష్టమే వచ్చింది కొడాలి నాని గారికి. నోరుతెరిస్తే చాలు.. బూతులు లేకుండా.. తిట్లు దొర్లకుండా మాట్లాడలేని మంత్రి కొడాలి నాని గారికి రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన శిక్ష విధించింది. ఎన్నికలు ముగిసేవరకు నోరెత్తొద్దని ఆదేశించింది. కనీసం మీడియాతోనూ మాట్లాడొద్దంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. కొడాలిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21 వరకు మంత్రి నాని బహిరంగ సభల్లోనూ, గ్రూపు సమావేశాల్లోనూ మాట్లాడకుండా నిషేధం విధించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. వీటిని అమలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్ లకు సూచించింది. నాని వ్యాఖ్యలను విద్వేషపూరిత ప్రసంగంగా ఎన్నికల సంఘం పరిగణించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు కూడా చేసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం మంత్రి కొడాలి నాని తాడేపల్లిలో విలేకరుల సమావేశం పెట్టి నిమ్మగడ్డను, చంద్రబాబును తన సహజ శైలిలో బూతులు తిట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్ఈసీ.. ఆయనకు షోకాజ్ నోటీసు పంపించింది. కొడాలి.. తన వివరణను సాయంత్రానికే ఈసీకి పంపించారు. ఎస్ఈసీ అంటే తనకు గౌరవమే అని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. పైగా ప్రెస్మీట్లో చేసిన ఆరోపణలు, విమర్శలను ఆయన వెనక్కి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయని నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఎస్ఈసీని అవి తీవ్రంగా అగౌరవపరిచేలా ఉన్నా యి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి మరో రాజ్యాంగబద్ధ సంస్థ, అధికారిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నానికి ఇది కొత్తకాదు. గతంలోనూ ఎస్ఈసీపైన, కమిషనర్గా ఉన్న నాపైన వ్యక్తిగతంగా అనుచిత విమర్శలు, ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషణలకు పాల్పడ్డారు. అయినా మేం శాంతి, సంయమనంతో వ్యవహరించాం. కానీ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలోనూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాలో చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసిచ్చాం. ఆయన ఇచ్చిన వివరణలో ఇసుమంతైనా పశ్చాత్తాపం కనిపించలేదు. ఎస్ఈసీపై చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చలేదు. ఉద్దేశపూరితంగా ఎన్నికల కమిషనర్పై దాడికి పాల్పడినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో.. ఈ నెల 21న ఎన్నికల ముగిసేంత వరకు మంత్రి మీడియాతో, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడొద్దని ఆదేశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు.
నిత్యం ఎవరో ఒకరిపై బూతులతో దాడి చేయందే పొద్దు గడవని మంత్రి గారికి ఈ పరిణామంతో.. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వ్యక్తులు, వ్యవస్థలపైన ఏమాత్రం గౌరవం, మర్యాద లేని మంత్రి గారు.. ఈసీ ఇచ్చిన ఈ ఆదేశాలనైనా పాటిస్తారో లేదో..! చూడాలి.
Must Read ;- పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు వార్నింగ్











