(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
మరో భద్రాద్రిగా పేరుగాంచిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం రామతీర్ధంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్యదినాన్ని పురస్కరించుకొని సీతారామ కల్యాణం బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, కొద్దిమంది అధికారులు, ముఖ్యుల మధ్య, ఆలయ పూజారులు కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తిలకించి పరవశించారు.
సంప్రదాయబద్ధంగా ..
ఆలయ సంప్రదాయానుసారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సింహాచల వరాహ నరసింహస్వామి ఆలయం అందజేసిన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వం తరపున .. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అందజేశారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు సాయిరాం ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు స్థానాచార్యులు, నరసింహాచార్యలు, పురోహితులు కిరణ్, టిటిడి వేద పండితులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఆర్జెసి, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఇఓ బ్రమరాంబ, ఆర్డిఓ బిహెచ్ భవానీ శంకర్, దేవాదాయ శాఖ డీసీ శాంతి, రామతీర్ధం ఆలయ ఇఓ బివివి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
విరాళాలు అందజేసిన బొత్స కుటుంబం
శ్రీ సీతారామలక్షణ స్వాముల వాహనాల తయారీ కోసం బొత్స కుటుంబం రూ.14.50 లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ సొమ్ముతో శ్రీరామచంద్రమూర్తికి గరుఢ వాహనం, లక్ష్మణస్వామికి అశ్వ వాహనం, సీతాదేవికి హంస వాహనాన్ని, ఆలయ అధికారులు బంగారు తాపడంతో తయారు చేయించనున్నారు.
ఆలయ అభివృద్ధికి ..
సీతారామస్వామి వారు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి ఆకాంక్షించారు. రామతీర్ధం ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆమె అన్నారు. కోవిడ్ కారణంగా, భక్తులను ఈ ఏడాది అనుమతించనప్పటికీ, సంప్రదాయభద్దంగా సీతారాముల కల్యాణాన్ని రమ్యంగా నిర్వహించినట్లు తెలిపారు.
Must Read ;- తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం : టీటీడీ అధికారిక ప్రకటన