(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో, సీతారామలక్ష్మణుల బాలాలయ విగ్రహ ప్రతిష్ట గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. బోడికొండపై కోదండరాముని ఆలయం కోసం టిటిడి రూపొందించిన ఈ నూతన విగ్రహాలను ఆలయంలో ఉంచి, చర ప్రతిష్ట నిర్వహించారు. దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ పర్యవేక్షణలో, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ ప్రవిత్ర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. టిటిడి నుంచి విగ్రహాలను తెప్పించిన తరువాత, ఈనెల 25న ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ కార్యక్రమాల అనంతరం గురువారం ముహూర్తం ప్రకారం ఉదయం 8.56 నిమిషాలకు పూర్ణాహుతితో ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బోడికొండపై ఆలయ నిర్మాణం పూర్తి అయ్యే వరకూ, ఈ సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఇక్కడే ఉంచి, ఎప్పటిలాగే నిత్య ఆరాధన, కైంకర్యాలను నిర్వహిస్తారు. ఏడాదిలోపు కొండపై ఆలయాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించాలని దేవాదాయశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ సుజాత, టిటిడి ఆగమ సలహాదారు సుందర వరదన్, ఆలయ ఇఓ సిహెచ్ రంగారావు, ఇన్స్పెక్టర్ లక్ష్మి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇఓ జివిఎస్ఎస్ఆర్ సుబ్రమణ్యం, ఆలయ పూజారులు, ఇతర దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Must Read ;- వైభవంగా శంబర పోలమాంబ జాతర
విగ్రహ ప్రతిష్ట పూర్తి : భ్రమరాంబ, ఆర్జెసి
రామతీర్థం బోడికొండ ఆలయం కోసం రూపొందించిన శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా పూర్తి చేసినట్లు దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ తెలిపారు. ప్రతిష్ట అనంతరం ఆలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, విగ్రహాలకు బాలాలయంలో చర ప్రతిష్ట నిర్వహించామని, ఇకనుంచీ యథావిదిగా నిత్య ఆరాధన జరుగుతుందని చెప్పారు. ఏడాదిలోపు బోడికొండపై ఆలయాన్ని నిర్మించడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయని, ఈ విగ్రహాలను కొత్త ఆలయంలో పునః ప్రతిష్ట చేస్తామని తెలిపారు.
నిత్య ఆరాధాన: ప్రొఫెసర్ శ్రీనివాసాచార్యులు, వేదిక్ యూనివర్సిటీ
బోడికొండ ఆలయం కోసం టిటిడి రూపొందించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలకు బాలాలయంలో, చర ప్రతిష్ట పూర్తయ్యిందని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు చెప్పారు. పూర్వం బోడికొండ అలయంలో జరిగినట్లే, ఈ విగ్రహాలకు ఇకనుంచీ ఎప్పటిలాగే నిత్యారాధన జరుగుతుందని ఆయన తెలిపారు. శాస్త్రప్రకారం ఏడాది వరకూ బాలాలయంలో విగ్రహాలను ఉంచి, నిత్యారాధన జరపవచ్చని, ఆ లోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయవలసి ఉందని ఆయన చెప్పారు.
Also Read ;- జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’











