ఏపీలో రాజన్న బిడ్డగా షర్మిలకు కూడా మరో అవకాశం ఉంది..!
సర్వేలు ప్రకారం 2019 ఎన్నికలకు ముందు జగన్ కంటే షర్మిలకే ప్రజాదరణ బాగుంది! జగన్ కంటే షర్మిల ప్రసంగం ప్రజలను ఉత్తేజపరుస్తోంది! దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తరువాత ఆ స్థాయి ప్రజారంజక ప్రసంగం చేసే వాక్ ధాటి షర్మిల సొంత! జగన్ రెడ్డి జైల్లో ఉన్నప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల ఓదార్పు యాత్ర చేశారు. అలానే పెద్దఎత్తున దీక్షలు చేశారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డితోపాటు ధీటుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు షర్మిల. ఆకట్టుకునే ప్రసంగంతో జగన్ రెడ్డి గెలుపులో షర్మిల ప్రముఖ పాత్ర పోషించిన సంగతి విదితమే! ప్రస్తుతం జగన్ రెడ్డి ఏపీలో పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూరమైంది. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి.. తనదైన మార్క్ రాజకీయాలతో ప్రజలతో, తెలంగాణ రైతులతో మమేకమై కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఫైట్ చేస్తున్నారు.
ఏపీలో కూడా షర్మిల పొలిటికల్ అడుగులు..!
తెలంగాణలో యువత ఉద్యోగాలపై, రైతు పడుతున్న ఇబ్బందులపై షర్మిల ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది! ఈ నేపధ్యంలో ఏపీలో కూడా రైతులు పంటలు నష్టపోయి నానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీనిపై షర్మిల స్పందించారు. సోమవారం హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల కొన్ని లీకులిచ్చారు. ఏపీలో కూడా మీ పార్టీ కార్యకలపాలు సాగిస్తారా? కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారని అడిగిన ప్రశ్నకు .. షర్మిల తెలివిగా సమాధానమిచ్చి లీకులిచ్చారు. రాజకీయ పార్టీని దేశంలో ఎప్పుడైనా.. ఎక్కడైన పెట్టవచ్చునని సమాధానమిచ్చారు. షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో రైతులు సంతృప్తిగా లేరు. పంటలన్నీ తెగులు సోకి, తీవ్ర నష్టాలు పాలయ్యారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తోంది. దీనిపై షర్మిల త్వరలో స్పందించి.. రైతుల పక్షాన పోరాడేందుకు ఏపీలో కూడా షర్మిల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తోంది.