ఏపీలో భూముల రీ సర్వే పెద్ద రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. వంద సంవత్సరాల తరవాత ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో సర్వే నిర్వహించి, ఎవరూ చెరిపివేయలేని విధంగా యాజమాన్య హక్కుల పట్టాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా…అసలు సమస్య భూమిపై హక్కులు లేకుండా లక్షలాది పేదలు పోరంబోకు భూములు, ఇనాం భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. వీరు సాగు చేసుకునే భూమికి సంబంధించి ఎలాంటి పట్టాలు ఉండవు. ఐదారు దశాబ్ధాలుగా పేదలు కొండ పోరంబోకు, డొంక భూములు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, కాలువగట్టు భూములు ఇలా అనేక రకాల భూముల సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికీ వీటిపై పేదలకు హక్కులు లేవు. ఎలాంటి పత్రాలు లేవు. రీ సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం పేదలు సాగు చేసుకుంటున్న భూమికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో లక్షల మంది పేదలు ఆందోళన చెందుతున్నారు.
హక్కుదారుడుకి హక్కు కల్పించడం ఏమిటి?
సర్వహక్కులు ఉన్న భూ యజమానికి శాశ్వత భూ హక్కు కల్పిస్తామని సీఎం ప్రకటించడం విడ్డూరంగా ఉందని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. అంటే ఇప్పటి దాకా భూ యజమానులకు వారి భూములపై హక్కు లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. రీసర్వే పేరుతో రూ.2600 కోట్లు దోపిడీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. తాజా రీసర్వే ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు సృష్టించి భూ యజమానుల మధ్య గొడవలు పెట్టేలా ఉన్నాయని వామపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా భూమి విషయంలో గొడవలు ఉన్నా, హక్కులపై సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఇలా ఎలాంటి గొడవలు లేని భూముల కొలతలు వేయడం అంటే వైసీపీ పెద్దలు మిగులు భూములను వెలికితీసి కాజేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.
రీ సర్వేతో మరిన్ని సమస్యలు
సహజంగా భూములు అమ్మినప్పుడు, కొనుగోలు చేసిన వ్యక్తి భూమిని సర్వే చేయించుకుని కొలతలు తీసుకుంటారు. డాక్యుమెంట్ల ప్రకారం భూమి కొలతలు ఉన్నాయా లేవా పరిశీలించుకుంటారు. కానీ ప్రభుత్వం తాజాగా ప్రతి అంగుళం భూమిని కొలుస్తామని రీ సర్వే ప్రారంభించింది. దీంతో ఎన్నో దశాబ్ధాలుగా వారసత్వంగా భూములను అనుభవిస్తున్నా వాటికి పట్టాలు లేని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి భూములకు హక్కు కల్పించకపోగా, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించే ప్రమాదం ఉందని అనుభవదారులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఒక భూమిని వరుసగా 13 సంవత్సరాల పాటు అనుభవిస్తే ఆ భూమి అతనికే చెందుతుందని చట్టాలు చెబుతున్నాయి. కానీ లక్షల మంది పేదలు దశాబ్ధాలుగా పోరంబోకు భూములు సాగు చేసుకుంటున్నా…వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు. తాజాగా ప్రారంభించిన రీ సర్వే ద్వారా అలాంటి వారు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
పెద్దల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపిస్తారా?
ఏపీలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు రాజకీయ నేతల కబ్జాలో ఉన్నాయి. ఇలాంటి భూములకు పట్టాలు లేకపోయినా కబ్జా చేసి అనుభవిస్తున్నారు. అయితే రీ సర్వేలో వారికి హక్కులు కట్టబెడతారా? లేదంటే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. కేవలం అన్ని హక్కులు ఉన్న భూముల కొలతలు వేసి వాటిని మరలా జగనన్న బొమ్మతో వారికే ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని జనం ప్రశ్నిస్తున్నారు. వివాదం లేని భూములు ఎన్నిసార్లు కొలుచుకున్నా ప్రయోజనం ఏముంటుంది. వివాదాల్లో ఉన్న భూములు, కబ్జాకు గురైన భూములు, పేదలు అనుభవిస్తున్న భూముల సమస్యలను పరిష్కరించాలని వామ పక్షాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు.