ప్రపంచంలోనే భక్తజనాదరణ, ఆదాయాల పరంగా అగ్రగామిగా ఉండే ధార్మికక్షేత్రం తిరుమల ప్రస్తుతం పరిమితంగా వస్తున్న భక్తులతో అలరారుతోంది. తిరుమల వేంకటేశ్వరస్వామివారికి ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలను ఏకాంతంలో, ఆలయ ప్రాంగణంలోపలే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఏకాంతంలో నిర్వహించే ఈ వేడుకలను టీవీఛానెళ్లు, వెబ్ ఛానెళ్లకు కూడా లైవ్ ప్రసారాలు ఇచ్చే అవకాశం కల్పించడం గురించి అధికారులు ఆలోచిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ ను నిర్వహిస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా.. తిరుమల బ్రహ్మోత్సవాలను ఈ ఛానెల్ ద్వారా పూర్తి స్థాయిలో లైవ్ ఇస్తారు. అలాగే.. ఇతర శాటిలైట్ టీవీ ఛానెళ్లకు కూడా.. ఎస్వీబీసీ లైవ్ సిగ్నల్ ఇస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన కార్యక్రమాలను, అన్ని వాహనసేవలను ప్రధాన ఛానెళ్లు అన్నీ లైవ్ ఇస్తుంటాయి. ఈసారి వాహనసేవల్లో కూడా ఇదివరకటి ఆర్భాటం ఉండదు.
మారుతున్న సాంకేతిక వాతావరణంలో కేవలం శాటిలైట్ టీవీ ఛానెళ్లకు మాత్రమే కాకుండా, వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లకు కూడా లైవ్ అవకాశం ఇవ్వాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అలాగే మొబైల్ వినియోగదారులు అందరికీ అందుబాటులో స్వామ ఉత్సవ వైభవాన్ని చూపించేలా.. ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. కేవలం ఎస్వీబీసీ లేదా శాటిలైట్ ఛానెళ్ల ద్వారా మాత్రమే లైవ్ ఇవ్వడం కంటె.. యాప్ ద్వారా, అన్ని యూట్యూబ్ చానెళ్ల ద్వారా కూడా బ్రహ్మోత్సవాలను లైవ్ ఇస్తే.. ఆదరణ మరింత ఉంటుందనే అంచనాతో ఉన్నారు.
యాప్ ద్వారా మొబైల్ వాడకం దార్లు అందరికీ అందుబాటులోకి బ్రహ్మోత్సవ వైభవాన్ని తీసుకురావడం మంచి నిర్ణయమే అవుతుందని.. కేవలం ఎస్వీబీసీలో చూసేవారికంటె ఈసారి వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని భక్తులు ఆశిస్తున్నారు.