టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేసేస్తున్నారు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. ఈ తరం ప్రేక్షకుల్ని మెప్పించే కథలతో పాటు.. తమ ఇమేజ్ కు తగిన స్టోరీస్ ను ఎంపికచేసుకుంటూ.. వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకుంటున్నారు. అంతేకాదండోయ్.. ఈ నలుగురు సినిమాలూ ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. వైరైటీ కాంబినేషన్స్ ను సెట్ చేసుకోవడంలోనూ వీరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త దర్శకులు వీరితో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో ఈ నలుగురూ నలుగురే అనిపించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేసిన ఈ సినిమా యూనిట్.. ఫ్రెష్ షెడ్యూల్ ను ఈ నెల్లోనే ప్లాన్ చేయబోతోంది. కథ విషయంలో కాపీ వివాదం నడిచినప్పటికీ.. చిరంజీవి రంగంలోకి దిగి.. సమస్యను పరిష్కరించారని.. తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా .. ఏప్రిల్ 9న సినిమా విడుదలకానుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొన్ని కొత్త కాంబినేషన్స్ ను వరుసగా సెట్ చేసుకున్నారు.
ముందుగా ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ వెర్షన్ ను వివి వినాయక్ దర్శకత్వంలో పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ‘వెంకీమామ’ ఫేమ్ బాబీ దర్శకత్వంలోనూ, మెహర్ రమేశ్ దర్శకత్వంలోనూ సినిమాల్ని వరుసగా లైన్ లో పెట్టుకున్నారు. అలాగే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య మూడో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘మోనార్క్ , డేంజర్ , టార్చ్ బేరర్’ ..ఇలా రకరకాల టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.
వీటిలో ఏదో ఒక టైటిల్ ను ఖాయం చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సీనియర్ దర్శకుడు బి.గోపాల్ లైన్ లో ఉన్నాడు. ఆయన దర్శకత్వంలో మళ్లీ సినిమా చేయాలని బాలకృష్ణ డిసైడయిపోయాడట. వీరి కాంబోలో ఇదివరకు లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి విజయవంతమైన సినిమాలొచ్చాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.
అప్పుడెప్పుడో బాలయ్యకి రామారావు అనే స్టోరీ కూడా చెప్పాడు. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఫ్రెష్ గా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో బాలయ్య తో ఒక సినిమా చేయబోతున్నాడట. ఇక పూరీ జగన్నాథ్ కూడా బాలకృష్ణతో మరో సినిమా చేయబోతున్నాడు. నాగార్జున విషయానికొస్తే.. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు. అషిషోర్ సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగ్ .. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను తిరిగి ప్రారంభించింది చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమా తర్వాత నాగ్ చేయబోతున్న మరో సినిమా ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీకి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అలాగే.. నాగ్.. బ్రహ్మాస్త్ర బాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ అసురన్ కు రీమేక్ వెర్షన్ అయిన ఇందులో వెంకీ పల్లెటూరి నేపథ్యంలో.. రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రల్ని పోషించబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత వెంకటేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేయబోతున్నాడు. అలాగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఇంకా కొందరు దర్శకులు వెంకటేశ్ కు కథలు వినిపించడానికి రెడీగా ఉన్నారు. సో… మొత్తం మీద టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురూ.. ఫుల్ బిజీగా ఉన్నారన్నమాట.