రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అందరికీ ఆనందమే. పరిశ్రమలు వస్తే వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. కానీ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, ఏపీకి కొత్త పెట్టుబడులు రావడం దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలే తరలి పోతున్నాయి. అయితే ఏపీలో కైనటిక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చిందని పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి ప్రకటించారు. రూ.1800 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు కైనటిక్ యాజమాన్యం లంబోర్గినితో ఒప్పందం కూడా చేసుకుందని తెలిపారు. ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేది కైనటిక్ యాజమాన్యమా లేదంటే లంబోర్గినీనా అర్ధం కావడం లేదు.
లాబీయింగ్తో అనేక అనుమానాలు
ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఓడ రేవులకు దగ్గరగా 150 ఎకరాల భూమిని కేటాయించాలని కైనటిక్ సంస్థ యాజమాన్యం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడ రేవుకు సమీపంలో భూమిని కేటాయించే ఆలోచనలో ఉంది. రూ.1800 కోట్లు పెట్టుబడి పెడతామని కెనటిక్ హామీ ఇచ్చింది. భారీ పెట్టుబడి పెట్టడానికి సంస్థ ముందుకు రావడాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కానీ కనీసం 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తేనే భారీ పరిశ్రమగా గుర్తిస్తారు. అలా గుర్తిస్తేనే ఏపీ ప్రకటించిన కొత్త పారిశ్రామిక పాలసీ ప్రకారం భారీ ప్రరిశ్రమలకు రాయితీలు అందుతాయి. కైనటిక్ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది కానీ కనీసం 2000 మందికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వలేకపోతోంది. దీంతో రాయితీలు అందుకునేందుకు సంస్థకు అర్హత లేకుండా పోయింది. అయినా భారీ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వంలోని కొందరి పెద్దలతో లాబీయింగ్ చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
లంబోర్గినితో కైనటిక్ ఒప్పందం ఏమిటి?
వాహనాల తయారీలో కైనటిక్ సంస్థకు మంచి పేరుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. ఇక్కడే లంబోర్గిని సంస్థను తెర మీదకు తీసుకువచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడి సంస్థకు ఇది అనుబంధ సంస్థగా ఉంది. లగ్జరీ వాహనాలతో పాటు, స్పోర్ట్స్ వాహనాలు తయారు చేయడంలో లంబోర్గిని సంస్థకు మంచి పేరుంది. అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టేది కైనటిక్ సంస్థా? లేక లంబోర్గినీనా అర్థం కావడం లేదు. కైనటిక్ పెట్టుబడులు పెడుతుంటే ప్రపంచ ప్రఖ్యాత లంబోర్గిని ఏపీలో పెట్టుబడులు పెడుతోందంటూ వైస్సార్సీపీలో నెంబరు 2గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఇది మరో వోక్స్ వ్యాగన్ తరహా కుంభకోణం అవుతుందా అనే అనుమానం రాకమానదు.
అతి ప్రచారం అనర్థదాయకం
ఏపీకి పెట్టుబడులు వస్తే ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో పెట్టుడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏపీలో భారీ పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చిన కైనటిక్ యాజమాన్యాన్ని అభినందించాల్సిందే. పెట్టుబడులు పెట్టేది కైనటిక్ అయితే లంబోర్గిని వస్తోందంటూ చేస్తున్న అతి ప్రచారంతో మేలు కన్నా కీడే ఎక్కువ జరిగే అవకావం ఉంది. ప్రచారం ఒక స్దాయి వరకు అవసరం. దాన్ని అతిగా ప్రచారం చేసుకుంటే అనర్థమే చోటుచేసుకుంటుంది. ఇలాంటి పరిశ్రమల పెట్టుబడులు విషయంలో అసలు ప్రచారం కంటే గోప్యతే ముఖ్యం. ఎందుకంటే చాలా రాష్ట్రాలు పరిశ్రమలు తమ ప్రాంతంలో పెట్టించుకునేందుకు,భారీ రాయితీలు ఇవ్వడంతోపాటు, లాబీయింగ్ కూడా ఆ స్ధాయిలోనే చేసుకుంటారు. ఏపీలో కైనటిక్ పెట్టుబడులకు సిద్దమవుతోందని బయటకు తెలియగానే పొరుగు రాష్ట్రాలు ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుని పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తరలించే ప్రమాదం ఉంది. కంపెనీ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే వరకూ పెట్టుబడుల విషయంలో పెద్దగా ప్రచారం చేసుకోకపోవడమే మేలని అనేక ఉదంతాలు మనకు స్పష్టం చేస్తున్నాయి.










