విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు ఏపీ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచింది. TCS ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకు ఎకరాకు 99 పైసల అత్యంత నామమాత్రపు లీజు నిర్ణయించింది.
రుషికొండలోని 21.6 ఎకరాలను టీసీఎస్కు కేటాయించారు. మొదట్లో భూమి ఉచితంగా ఇవ్వాలనే భావించినప్పటికీ..ఎంతో కొంత మొత్తం లీజుగా ఉండాలన్న నిబంధన మేరకు..99 పైసల నామమాత్రపు లీజు నిర్ణయించారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఉచితంగా ఇచ్చినట్లే. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏ సంస్థకు ఈ విధానంలో భూమి కేటాయించలేదు. విశాఖలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో TCS రూ.1370 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. దశల వారీగా 12 వేల నుంచి 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
విశాఖను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. గతేడాది ఆగస్టులో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత..అక్టోబరులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముంబైలోని టాటా హౌస్లో చంద్రశేఖరన్తో చర్చలు జరిపారు. నవంబరులో చంద్రబాబు మరో విడత చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. విశాఖలో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కానుందని ప్రభుత్వ వర్గాలు అప్పుడే సంకేతాలు పంపించాయి. మరోవైపు…రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలికి కో-చైర్మన్గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఇదే క్రమంలో…ఇప్పుడు విశాఖలో టీసీఎస్కు 21.6 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఐటీ పరిశ్రమ ఎదిగేందుకు TCS యాంకర్ పని చేస్తుందని, మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖకు తరలివస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా సనంద్లో టాటా మోటార్స్కు చౌకగా స్థలం కేటాయించారు. ఆ తర్వాత సనంద్ ప్రఖ్యాత ఆటోమొబైల్ హబ్గా రూపుదిద్దుకుంది. ఇదే క్రమంలో…టీసీఎస్ రాకతో విశాఖ దేశంలోని ప్రముఖ ఐటీ హబ్లలో ఒకటవుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నిజానికి, టీసీఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం హిల్ నంబరు 3లో మిలీనియం టవర్-ఏ, బీలను కేటాయించింది. అది ఆర్థిక మండలి పరిధిలో ఉండడంతో డీనోటిఫై చేసే ప్రక్రియ మొదలైంది. అయితే…తమ కార్యకలాపాలకు ఈ ప్రాంగణం సరిపోదని, సొంతం క్యాంపస్ ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని టీసీఎస్ కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ అదే కొండపై 21.16 ఎకరాలు కేటాయించింది. అక్కడ శాశ్వత భవనాలు నిర్మించేలోగా…మిలీనియం టవర్-ఏ, బీ నుంచే టీసీఎస్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. రెండు మూడు నెలల్లోనే ఇందుకు శ్రీకారం చుట్టే అవకాశముంది.