(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా కాపాడటం కోసం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు దీన్ని తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు.
వైజాగ్ స్టీల్ ప్రయివేటీకరణ అంశం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి మరీ సాధించుకున్న ఈ కర్మాగారాన్ని ప్రయివేటీకరించడానికి కేంద్రం సన్నద్ధం అవుతోంది. ఈ విషయమై అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. మరోవైపు గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను స్పీకర్కు పంపారు.
మొదటి అడుగు..
విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేట్ పరం కానీయొద్దని ఆంధ్రులు భావిస్తోన్న వేళ.. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఆన్లైన్లో సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు.
విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకుందాం! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో త్యాగాలు చేసిన తెలుగు వారి సంకల్పానికి ద్రోహం జరక్కుండా అడ్డుకుందాం. ఎందుకు ప్రవేటీకరించద్దో ఇక్కడ చదివి, మీ సంతకంతో మద్దతు తెలపండి. విశాఖ ఉక్కు కోసం మన పోరాటంలో ఇది మొదటి మెట్టు!https://t.co/hdN2Hgto0R
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 6, 2021
‘‘విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో త్యాగాలు చేసిన తెలుగు వారి సంకల్పానికి ద్రోహం జరక్కుండా అడ్డుకుందాం. ఎందుకు ప్రవేటీకరించొద్దో ఇక్కడ చదివి, మీ సంతకంతో మద్దతు తెలపండి. విశాఖ ఉక్కు కోసం మన పోరాటంలో ఇది మొదటి మెట్టు’’ అని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ఛేంజ్.ఆర్గ్లో పిటిషన్ ద్వారా సంతకాల సేకరణ మొదలుపెట్టారు.
Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎమ్మెల్యే గంటా రాజీనామా











