తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదీ చేసినా అదో సెన్సేషనే. అది రెవెన్యూ శాఖ ప్రక్షాళన కావొచ్చు.. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం కావొచ్చు.. ధరణి పోర్టల్ సేవలు.. అలాగే 70 ఏళ్ల చరిత్ర ఉన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చి ఆ స్థానంలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టడం కావొచ్చు. ఇలా ఏదీ చేసినా కేసీఆర్ మార్క్ కచ్చితంగా ఉంటుంది. ఎవరేమనుకున్నా డోంట్కేర్ అంటారు. తాను తీసుకున్న నిర్ణయంలో దాదాపు ఎలాంటి మార్పులు, చేర్పులను ఆయన చేయరు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ పోతారు అంతే.
షాపూర్జీ సంస్థకు టెండర్..
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చి అక్కడ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ నిర్మించాలనుకున్నారు. అందులోభాగంగానే దాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ఆధునిక హంగులతో కొత్తది కట్టాలనుకున్నారు. కొత్త సెక్రటేరియట్ భవన నమూనాని కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. పర్యావరణ హితంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కొత్త సచివాలయం ఉండనుంది. నిర్మాణ అంచనా వ్యయం దాదాపు రూ.500 కోట్లతో గత నెలలో రోడ్లు భవనాల శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది. దీనికి పలు సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు టెండర్లను ప్రభుత్వం స్వీకరించింది. బుధవారం రోజు కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కమిషనర్ ఆఫ్ టెండర్స్ ఖరారు చేసింది.
ఈ టెండర్ల కోసం పలు సంస్థలు పోటీపడ్డాయి. అయితే ఈ టెండర్ని షాపూర్జీ పల్లొంజీ కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థకు ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరగనుంది. దాని ప్రకారమే నిర్మాణం జరగనుంది. ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంస్థ ఆ రోజు నుంచి 12 నెలల లోపు సచివాలయంను నిర్మించాల్సి ఉంటుంది. ఏడాదిలోగా నూతన సెక్రటేరియట్ నుంచి సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈక్రమంలోనే వచ్చే ఏడాది దీపావళి వరకు ఈ నూతన సచివాలయం అందుబాటులోకి తీసుకురానన్నట్లు తెలుస్తోంది.