ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం మరో విడత అదే తరహా విలీనానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ప్రధానంగా చిన్న బ్యాంకులలో రుణాల ఎగవేతలు, ఆర్థిక అననుకూల పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కొవడంతో పాటు నిధులు సమీకరించుకోవడానికీ కూడా ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాణీక వచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద బ్యాంకులే దీర్ఘకాలంలో మనుగడ సాగించగలవన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఇందులో భాగంగా మోదీ సర్కారు మొదటగా 2017లో ఎస్ బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసింది. దీంతో ఎస్ బీఐ దిగ్గజ బ్యాంకుగా అవతరించింది. ఆ తర్వాత రెండో విడతగా 2019, 2020లో ఇతర బ్యాంకుల మధ్య విలీనాన్ని పూర్తి చేసింది.
ఈ నేపధ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఏడు పెద్ద బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు పనిచేస్తున్నాయి. మరో విడత విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 4-5 కు కుదించాలన్నది ప్రభుత్వ యోచనగా వుందని అధికార వర్గాలు ద్వారా తెలుస్తోంది.2017కు ముందు ప్రభుత్వరంగంలో 27 బ్యాంకులు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు 12కు తగ్గింది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగిన విలీనాలతో వచ్చిన ఫలితాలపై లోతైన అధ్యయన నివేదికను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం..ఈ నెలాఖరుకు తమ అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కోరినట్టు సమాచారం. అదేసమయంలో భవిష్యత్తు ప్రణాళికను రూపొందించే ముందు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , భాగస్వాములను సంప్రదించనున్నట్టు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం.