తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకింది. ఇటీవలి వైద్యపరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఆయన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి ఇటీవలే అధికార్ల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఛైర్మన్ కు కరోనా పాజిటివ్ రావడంతో టీటీడీ అధికార్ల పరిస్థితి కూడా అనుమానంగా మారింది.
ఈనెల 12 వ తేదీన వైవీ సుబ్బారెడ్డి తన తల్లి పిచ్చిమ్మ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తనకే కరోనా పాజిటివ్ గా తేలడంతో, తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
కరోనా బారిన పడుతున్న ప్రముఖులు..
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వారాల కిందటి పరిస్థితితో పోలిస్తే.. కరోనా ఉధృతి బాగా తగ్గుతున్నట్లుగా బులెటిన్లు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రముఖులు మాత్రం వరుసగా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రత్యేకించి.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ నాడు పాల్గొన్న వారిలో అనేక మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ వేడుకల తర్వాత.. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా కరోనా బారిన పడ్డారు. మధ్యలో నెగటివ్ వచ్చింది. మళ్లీ రెండోసారి పాజిటివ్ వచ్చి పరిస్థితి విషమించడంతో ఆయన ప్రత్యేకవిమానంలో హైదరాబాదు చికిత్స నిమిత్తం వచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాదులో రెండు దఫాలుగా చికిత్స పొంది.. డిశ్చార్జి కూడా అయ్యారు.
ఛైర్మన్ లేకుండానే బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు నెలలోనే సాలకట్ల బ్రహ్మోత్సవం జరిగింది. ఇవాళ్టి అంకురార్పణతో రెండో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. సుబ్బారెడ్డి కరోనాతో చికిత్స పొందుతుండడంతో.. ఈ బ్రహ్మోత్సవాలు ఛైర్మన్ గైర్హాజరీలోనే జరగబోతున్నాయి.