తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఒకవైపు ఉద్యోగులు సంబురాలు చేసుకుంటుంటే, మరో వైపు నిరుద్యోగులు సీఎం కేసీఆర్ పై దండయాత్రకు దిగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రాణాలు అర్పించినవాళ్లలో అనేక మంది నిరుద్యోగులే అయినా.. ప్రభుత్వం త్యాగాలను గుర్తించడం లేదని విమర్శిస్తున్నారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 61కి పెంచడం నిరుద్యోగులను వంచించడమేనని మండిపడుతున్నారు. రిటైర్మెంట్లు లేకపోతే మూడేళ్ల దాకా కొత్త నియామకాలే ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ కేయూ విద్యార్థులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి, తమ నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి సారాతో అభిషేకం చేశారు. పదవి విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు.
Must Read ;- కేసీఆర్ పీఆర్సీ ప్రకటన : ఏపీతో పోల్చితే ఎక్కువే!











