(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ ఇటీవల నియమించిన పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు, ఇన్చార్జి బాధ్యతలు నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు అప్పగించ కపోవడం పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. అందులో ఒకరు పార్టీ గోడ దూకేందుకు ప్రారంభం నుంచి ఎదురుచూస్తుండగా, మరొకరు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వ్యక్తి కావడమే విశేషం.
ప్రధానంగా విశాఖ నగరంలో గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేల లో.. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధికారపార్టీకి మద్దతుదారుడుగా మారిపోయిన విషయం తెలిసిందే. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబుకు పార్టీ.. బాధ్యతలు అప్పగించింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలైన గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబుకు బాధ్యతల నుంచి దూరంగా ఉంచింది.
ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికార పార్టీలో చేరడం ఖాయంగా మారిన తరుణంలో ఆయన్ను పక్కన పెట్టే అవకాశం ఉంది. కాగా, వెలగపూడి కి బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు అన్నదే ప్రధాన చర్చగా మారింది. అటు మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తికి, పల్లా శ్రీనివాసరావుకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. విశాఖ నగరంలో పార్టీ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వరుసలో ఉండే వెలగపూడి లాంటి నాయకుడి సేవలు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? అన్న దానిపై అందరూ ఆరా తీస్తున్నారు.
ఇంతకూ అసలు సంగతి ఏంటంటే.. తనకు బాధ్యతలు వద్దని వెలగపూడి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ఆయన విన్నపం మేరకే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నియోజకవర్గం లోని సమస్యలు, ఇతరత్రా కారణాల దృష్ట్యా అదనంగా ఇచ్చే బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేయలేను అన్న భావనతోనే వెలగపూడి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి వెలగపూడి రామకృష్ణబాబును కూడా వైఎస్సార్సీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. కొడాలి నాని ద్వారా ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు వినిపించింది. ఆ నేపథ్యంలో ఆయనకు బాధ్యతలు ఇవ్వకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది గానీ.. వాస్తవంలో.. ఆయనే బాధ్యతలు వద్దన్నారని.. నియోజకవర్గ పనుల దృష్ట్యా అలా అడిగారని తెలుస్తోంది.