వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో గానీ.. అప్పటికే ఏపీలో పరిశ్రమలు పెడతామంటూ ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలంతా ఆ తర్వాత వెనక్కు జారుకుంటున్నారు. ఏపీలో స్థాపిస్తామని చెప్పిన తమ ప్రాజెక్టులను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే లులూ గ్రూపుతో పాటు జగన్ అమితంగా ఇష్టపడే రిలయన్స్ కూడా ఇప్పటికే చేరిపోగా.. తాజాగా మరో కీలక పరిశ్రమ ఏపీ నుంచి పరారైపోయింది. అలా పరారైన సదరు పరిశ్రమ మరెక్కడికో కాకుండా తెలంగాణకు తరలివెళ్లిపోయింది. ఫలితంగా రూ.2 వేల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోగా.. ఏపీలో ఏకంగా 2 వేల మందికి లభిస్తుందనుకున్న ఉపాధి తెలంగాణ వాసులకు దక్కిపోయింది. ఈ దిశగా వీఈఎమ్ టెక్నాలజీస్ అనే రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థను జగన్ సర్కారు చేజేతులారా తెలంగాణకు తరలించేసింది.
పశ్చిమ నుంచి సంగారెడ్డికి..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ వీఈఎమ్ టెక్నాలజీస్ తన కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చింది. రూ.2,135 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటించిన ఆ సంస్థ.. తొలి విడతగా వెయ్యి కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ కంపెనీకి చంద్రబాబు సర్కారు రెడ్ కార్పెట్ పరిచిందనే చెప్పాలి. కంపెనీ అడిగిన మేరకు పెదవేగి మండలంలో 325 ఎకరాల భూమిని కూడా అప్పగించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. 2018లో జరిగిన చర్చలు 2019 ఎన్నికల నేపథ్యంలో ముందుకు సాగేందుకు వీలు పడలేదు. ఏపీ ప్రజల దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంతే.. ఈ కంపెనీ సహా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అప్పటికే చంద్రబాబు సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలను పట్టించుకోవడం జగన్ సర్కారు మానేసింది. ఫలితంగా ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఆయా సంస్థలన్నీ ఏపీ నుంచి తమ పెట్టుబడులను మరలించేశాయి. ఇందులో భాగంగా వీఈఎమ్ టెక్నీలజీస్ కూడా తన కర్మాగారాన్ని ఏపీ నుంచి తెలంగాణకు తరలించేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని ఎల్గోయిలో ఈ పరిశ్రమను పెట్టేందుకు ముందుకు రాగా.. ఆదివారం నాడు కేసీఆర్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది.
సతీష్ రెడ్డి సమక్షంలోనే..
రక్షణ శాఖలోని కీలక విభాగం డీఆర్డీఓ చైర్మన్, ఏపీకి చెందిన సతీష్ రెడ్డి సమక్షంలోనే తెలంగాణ సర్కారుతో వీఈఎమ్ టెక్నాలజీస్ ఆదివారం ఒప్పందం చేసుకుంది. ఏపీతో చేసుకున్న ఒప్పందం మాదిరే తెలంగాణలో తమ కర్మాగారం కోసం తొలి విడతలో రూ.1,000 కోట్లను పెట్టుబడిని పెట్టనున్న వీఈఎమ్.. మలి విడతలో మరో రూ.1,135 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. తొలి దశ పెట్టుబడులతోనే తెలంగాణలో 2 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఆదివారం తెలంగాణ సర్కారు, వీఈఎమ్ టెక్నాలజీస్ కుదుర్చుకున్న ఒప్పందంపై తెలంగాణ తరఫున తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వీఈఎమ్ టెక్నాలజీస్ ఎండీ వెంకటరాజు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి హాజరయ్యారు.