నిన్న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఒక బక్క జీవి అయిన కేసీఆర్ను కొట్టడానికి ఇంత మంది కేంద్ర మంత్రులు రావాలా? అని బీజేపీని ఉద్ధేశిస్తూ పరోక్షంగా విమర్శించారు. అయితే కేసీఆర్ అన్న ఈ మాటలపై విజయశాంతి తాజాగా సెటైర్లు విసిరారు.
‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉంది. ఒక బక్క జీవి అయిన కేసీఆర్ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని సీఎం గారు ప్రశ్నించారు. కేసీఆర్ గారి మాటలు వింటుంటే… ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో… తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది.
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోహాలు జరిగిపోతాయని కేసీఆర్ గారు అరిచి గీపెడుతున్నారు. సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్ధేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే… దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయి. మరి అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు. కేసీఆర్ గారి కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి అధికారం ఎలా దక్కుతుంది?.’’ అని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.