(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పలాసలో తెలుగుదేశం కార్యకర్త లక్కోజు వినోద్ కుమార్ అరెస్టు సినీఫక్కీలో జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నేరుగా కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తే తప్ప పోలీసులు విషయం బయటకు చెప్పలేదని వినోద్ కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ రంగ ప్రవేశంతో ..
పలాసకు చెందిన తెదేపా సోషల్మీడియా కార్యకర్త వినోద్ను చూపించాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు డీఎస్పీ శివరామిరెడ్డిని కోరారు. వినోద్ అదృశ్యం కావటంతో స్థానిక తెదేపా నాయకుల సమాచారంతో ఎంపీ కాశీబుగ్గ స్టేషన్కు వెళ్లి డీఎస్పీతో మాట్లాడారు. మద్యం సీసాలు అధికంగా కలిగి ఉన్నాడనే నేరంతో కేసు నమోదు చేశామని, స్థానికంగా మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవటంతో పాలకొండ తరలించారని డీఎస్పీ పేర్కొన్నారు. దీంతో ఎంపీ .. తాను పోలీసులతో మాట్లాడినపుడు సోషల్మీడియా కేసు అని చెప్పారన్నారు.
అర్ధరాత్రి వేళ అంత అర్జెంటుగా కేసు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఇద్దరు రౌడీలు వినోద్పై దాడిచేశారని తమకు సమాచారం ఉందని, ఇంటిలో ఉన్న వ్యక్తిపై మద్యం సీసాల కేసు నమోదు చేయటం వెనుక వైకాపా నేతల కుట్ర కనబడుతోందని అన్నారు. తమకు ఎఫ్.ఐ.ఆర్. కాపీని అందించాలని కోరారు”. దీంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తాము వచ్చి అడిగేంతవరకు కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా ఎలా తీసుకెళ్లిపోయారని ఎంపీ ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలో ఎఫ్.ఐ.ఆర్. కాపీ అందజేయటంతో తెదేపా నేతలు వెనుదిరిగారు.
మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావు : ఎస్పీ
పలాసకు చెందిన లక్కోజి వినోద్ కుమార్ పై మీడియా చానల్లో వస్తున్న వార్తలు వాస్తవాలు కావని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. అతనిపై చట్టప్రకారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ నందు క్రైమ్. నెం.16/2021 ఆంద్రప్రదేశ్ ఎక్ససైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయటం జరిగిందని తెలిపారు. అతని వద్ద అక్రమంగా కలిగియున్న ఓడిశా మద్యం నాలుగు 750 ఎమ్.ఎల్ బోటల్స్, బైకు సీజ్ చేసి, కోర్టు వారు ఉత్తర్వులు మేరకు పాతపట్నం సబ్ జైలుకు రిమాండుకు తరలించామన్నారు. లక్కోజి వినోద్ కుమార్ కిడ్నాప్, ఇతర వదంతులు వాస్తవాలు కావని స్పష్టం చేశారు.