( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ ఆధ్వర్యంలో అమరావతి రైతుల అరెస్ట్పై గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ద్వితీయ శ్రేణి నాయకులు పాల్లొన్నారు. కానీ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి జి వి ఆర్ నాయుడు (గణబాబు) కనిపించలేదు. గత కొంత కాలంగా గణబాబు వ్యవహారశైలి గోడ మీద పిల్లి వాటంలా అనుమానాస్పదంగానే ఉంది. మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెంటే గణబాబు కూడా వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే పార్టీ అధినాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. నగరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఇప్పటికే దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుగా చేరిపోయారు. ఆయన తర్వాత గంటా శ్రీనివాసరావు… వెనువెంటే గణబాబు పార్టీలో చేరుతారని ప్రచారం విస్తృతంగా జరిగింది. కొన్ని కారణాల రీత్యా గంట చేరిక వాయిదా పడగా, గణబాబు గత కొంత కాలంగా గోడ మీది పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యక్ష ఆందోళనలకు స్వస్తి పలికి, ప్రెస్ నోట్లకు పరిమితమవుతున్నారు. అది కూడా అధికార పార్టీని ఎక్కడా విమర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, వివిధ శాఖల మంత్రులకు అభివృద్ధి పనుల పేరట లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆ లేఖల సారాంశం. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను నియమించింది. అందులో గణబాబుకు కూడా చోటు దక్కడంతో ఆయన పార్టీ మారరు అన్న భరోసాతోనే చంద్రబాబు ఆ బాధ్యతలు అప్పగించారని భావిస్తూ వస్తున్నారు.
పార్టీ పిలుపునిచ్చిన నిరసనలకు దూరం..
అమరావతి రైతులకు బేడీలు వేయడం సిగ్గుమాలిన చర్య అని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే గణబాబు గైర్హాజరు కావడంతో ఆయన పార్టీలోనే ఉంటారా? అన్న చర్చ మళ్ళీ మొదలైంది. గతంలోనూ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాల్లో గణబాబు కనిపించలేదు. అంతే కాకుండా సాటి తెలుగుదేశం నాయకుల ఆస్తులపై ఏక పక్షంగా దాడులు జరుగుతున్నా ఆయన ఖండించడం లేదు. మద్ధతు పలికేందుకు ఆయా నాయకుల చెంతకు వెళ్లడం లేదు. మాజీ మేయర్ సబ్బం హరి, గీతం విద్యా సంస్థల ఆస్తులపై దాడులు జరిగినప్పుడు కూడా గణబాబు స్పందించలేదు.
అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, విమర్శించడం వల్ల రేపొద్దున్న పార్టీ మారాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ముందు చూపుతోనే గణబాబు ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖలోని తెలుగుదేశం పార్టీ నాయకులను వైసీపీ లోకి ఒక్కొక్కరిని తీసుకుంటున్న వైనం చూస్తుంటే అందుకు గణబాబు కూడా మినహాయింపు కాదని ఆయన వ్యవహార శైలిని బట్టి స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఆయన నేరుగా ఖండించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇలా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించడం వల్ల రెండిటికీ చెడ్డ రేవడిగా అవుతుందేమో వేచి చూడాలి.











