ముంబయికి చెందిన నటి కాదంబరి జత్వానీని జగన్ హాయాంలో వేధించిన వ్యవహారంలో ఇప్పటివరకు ఐపీఎస్ అధికారులు, పోలీసులు, వైసీపీ నేతల పాత్ర బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు రంగంలోకి దిగారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా సివిల్ అధికారుల స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్న సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాక ముంబయి నటిపై అక్రమ కేసు నమోదు కావడంలో ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినట్లు బయటికి వచ్చింది. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది చాలా కీలక పాత్ర పోషించినట్లుగా దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్కు చెందిన భూమిని.. నటి జత్వానీ ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించినట్లుగా తప్పుడు పత్రాలు క్రియేట్ చేయడంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది క్రియాశీలంగా వ్యవహరించినట్లు గుర్తించారు.
ఒంగోలుకు ఈ న్యాయవాది పలువురు పోలీసు ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితుడని.. కట్టుకథల్లో దిట్టగా పేరుందని అంటున్నారు. కష్టమైన కేసుల్లో లీగల్ అడ్వైజ్ల కోసం సాధారణంగా విచారణ చేసే అధికారులు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తుంటారని అంటున్నారు. అలా జగన్ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన పలు కేసుల్లో అత్యంత క్రియాశీలకంగా ఈయన వ్యవహరించారు. వైసీపీ నేతలు, సీనియర్ పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో జత్వానీ కేసులోనూ ఆయన అత్యంత కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.
ఆ లాయర్ జగన్ అధికారంలో ఉండగా ఉన్నతాధికారులతో పరిచయాలు ఉండడం కారణంగా పెద్దఎత్తున సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. ఒంగోలులో సంచలనం సృష్టించిన ల్యాండ్ స్కామ్ లో కూడా వైసీపీకి సన్నిహితులైన కొందరు వ్యక్తుల తరఫున పని చేసినట్లుగా చెబుతున్నారు. వారంతా ఒంగోలులో నకిలీ స్టాంపులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు కొల్లగొట్టేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. అలా జత్వానీ కేసులో అక్రమ కేసుల నమోదుకు ఈ లాయర్ నే వైసీపీ నేతలు సంప్రదించి ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ కేసులో జత్వానీ అరెస్టు తర్వాత సదరు లాయర్ కు ఓ లగ్జరీ కారును సైతం బహుమతిగా వైసీపీ అధిష్ఠానం పంపినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.











