టీమిండియా ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఘనంగా అంతర్జాతీయ కెరీర్ ఆరంభం
భారీ హిట్టర్గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్ రేట్తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్తో 13 వికెట్లు పడగొట్టారు. టి20ల కంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్ రేట్తో 810 పరుగులు సాధించారు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్ కప్లో చాంపియన్గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడారు.

ఐపీఎల్లోనూ ఆదరణ లేక..
టీమిండియాకి 2012 మార్చి 30లో చివరిసారి మ్యాచ్ ఆడిన యూసుఫ్ పఠాన్.. ఆ తర్వాత ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కే పరిమితమయ్యారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడిన యూసుఫ్.. 2019 సీజన్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో చివరి రెండు ఐపీఎల్ సీజన్ల వేలాల్లో ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు. దీంతో దేశవాళీ క్రికెట్కే పరిమితమైన యూసుఫ్.. తాజాగా క్రికెట్కు గుడ్ బై చెప్పారు.
‘నాకు అండగా ఉంటూ నా పై ప్రేమాభిమానాలు చాటిన నా దేశం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, కోచ్లకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ నన్ను ఇలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా’ అని యూసుఫ్ ట్విటర్లో పేర్కొన్నారు.
Must Read ;- ఐపీఎల్లో తొలిసారిగా సచిన్ తనయుడు.. ధరెంతో తెలుసా?











