వైసీపీ ఐదేళ్ల పాలనలో అక్రమాలు, దారుణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. లిక్కర్, మైనింగ్ ఇలా ఏ శాఖలోనైనా అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. వై.ఎస్.జగన్ హయాంలో సాగిన ఇసుక దోపిడి తాజాగా శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా రుజువైంది. తవ్వాల్సిన దాని కంటే ఎక్కువగా తవ్వినట్లు రుజువైంది. రవ్వంత తవ్వాల్సిన చోట కొండంత తవ్వినట్లు తేలిపోయింది. అనుమతించిన రీచ్లలో తవ్విన ఇసుక సుమారు 20 లక్షల టన్నులు! కానీ…అనధికారికంగా, అక్రమంగా తవ్వుకున్నది ఏకంగా 3 కోట్ల 91 లక్షల టన్నులు. ఇది జగన్ జమానాలో సాగిన ఇసుక దోపిడి.
జగన్ సర్కారు హయాంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును JP వెంచర్స్కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత…అసలు ఆ సంస్థ తెరవెనక్కు వెళ్లిపోయింది. వైసీపీ పెద్దలే నేరుా రంగంలోకి దిగి…జిల్లాల వారీగా ఇసుక తవ్వకాలను తమ నేతలకు కట్టబెట్టారు. 2021లో జేపీ వెంచర్స్ తవ్వకాలు మొదలైనప్పుడే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై గుంటూరుకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి NGTలో కేసులు వేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అని NGT నిర్ధారించి…JP వెంచర్స్కు కోట్లలో జరిమానా విధించింది. ఐతే ఈ తీర్పును జేపీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జరిమానా వసూలుపై స్టే విధించినప్పటికీ…కేసు విచారణ కొనసాగుతోంది. జగన్ సీఎంగా ఉండగా ఇసుక తవ్వకాలపై గనుల శాఖ అటు NGTకి, ఇటు సుప్రీంకోర్టుకు పదేపదే తప్పుడు నివేదికలు ఇచ్చింది.
ఐతే కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లిక్కర్, రేషన్ బియ్యంపై విచారణ సాగుతోంది. తాజాగా ఇసుక తవ్వకాలపైనా దృష్టి సారించిన కూటమి సర్కార్..జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, పర్యావరణ ఉల్లంఘన జరిగిందని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అక్ర మ తవ్వకాలపై శాటిలైట్ ఇమేజెస్, గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ఆధారంగా చేయాలని సుప్రీం కోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు జరిగిన రీచ్లపై ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా గనులశాఖ అధ్యయనం చేయించింది. ఇసుక తవ్వకాలు జరిగిన నదుల పరిధిలోని 794 పాయింట్ల శాటిలైట్ చిత్రాలను ఏపీఎ్సఏసీ అధ్యయనం చేసింది. ఇందులో… అనుమతించిన రీచ్ల పరిధిలో జరిగిన తవ్వకాలు, బయట అక్రమంగా జరిగిన తవ్వకాలు, భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక మైనింగ్ చేసిన నదీతీరాల ఫొటోలను స్పష్టంగా బయటకు తీసింది. మొత్తం 283 శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి… వాస్తవాలను బయటపెట్టింది.
కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర నదుల్లో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శాటిలైడ్ ఇమేజెస్ ద్వారా అధ్యయనం చేశారు. అనుమతించిన రీచ్లకు, అక్కడ జరిగిన తవ్వకాలకు అసలు పొంతనే లేదని నిర్ధారించారు. ఒక హెక్టారుకు అనుమతి ఇచ్చిన చోట 40 హెక్టార్ట పరిధిలో తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. కృష్ణా, గోదావరి పరిధిలో… కొన్ని చోట్ల ప్రవాహ దిశ మారేలా అక్రమ తవ్వకాలు జరిపారంటే అర్థం చేసుకోచ్చు. 2021 నుంచి 2024 మే వరకు… మూడేళ్ల వ్యవధిలో 794 ఇసుక తవ్వకాల పాయింట్లను ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలించారు. వీటిలో 85 మాత్రమే అనుమతించిన, అధికారిక రీచ్లు. ఈ పాయింట్ల వద్ద తీసిన ఇసుక 19.69 లక్షల టన్నులు.
ఇక, నిబంధనలు ఉల్లంఘించి నదీగర్భాలను కూడా కలిపి తవ్వేసిన పాయింట్లు 709. వీటిల్లో ఏకంగా 3.91 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించారు. జగన్ పాలనలో ఇసుక అమ్మకాల ద్వారా తొలి రెండేళ్లకు సర్కారుకు రూ.1500 కోట్ల ఆదాయం వచ్చిందని గొప్పగా చెప్పారు. అందులో జేపీ వెంచర్స్ ఇంకా 800 కోట్ల బకాయి ఉంది. నిబంధనలకు లోబడి 85 శాండ్ పాయింట్లలో తవ్విన ఇసుక సొమ్మును మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చిందనుకుంటే… మరి మిగిలిన 709 పాయిట్లలో తవ్వితీసిన 3.91 కోట్ల టన్నుల ఇసుక ద్వారా వచ్చిన సొమ్ము ఏమైంది? అది ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇసుక టెండర్లు, అక్రమాలపై ఇటు సీఐడీ, అటు ఏసీబీ విచారణ చేస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణ కోసం గనులశాఖ సమర్పించిన డాక్యుమెంట్పై మంగళవారం సీఎం చంద్రబాబు దగ్గర చర్చ జరిగినట్లు తెలిసింది.