తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురైన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముందే ప్రక్షాళన చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మొహమాటానికి పోయి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే.. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని బాగా విశ్లేషణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిద్దరు మాజీ మంత్రులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. తన ముఖం చూసి జనం ఓటేస్తారనుకొని కేసీఆర్ గుడ్డిగా నమ్మేయడమే కేసీఆర్ కొంప ముంచింది. అలా తన కొంప మునగకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటిదాకా కొంత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఉండవని ప్రచారం జరగ్గా.. తాజాగా వరుసగా ఎమ్మెల్యేలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపులు అందుతున్నాయి.
దీంతో తమకు కూడా ఎక్కడ పిలుపు వస్తుందో అని ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. తాజాగా మంగళవారం ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, ఉష శ్రీ చరణ్, రఘురామ రెడ్డి, ప్రసాద్ రాజు, కిలారు రోశయ్య, విశ్వరూప్, కొండేటి చిట్టిబాబు తదితరులకు పిలుపులు అందాయి. వెంటనే తాడేపల్లికి వచ్చిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో వన్ టూ వన్ కూర్చొని సజ్జల రామక్రిష్ణా రెడ్డి, మిథున్ రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. కొంత మందితో జగన్ మాట్లాడుతున్నారు.
టికెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఎంత బతిమాలుకున్నా అధిష్ఠానం ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఏ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తమకు ఇవ్వకపోయినా తమ కుటుంబంలో ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. అయినా టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పడంతో ఎమ్మె్ల్యేలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మంత్రి విశ్వరూప్ కు కూడా ఇదే పరాభవం ఎదురైనట్లు సమాచారం. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండకపోవడంతో టికెట్ నిరాకరణకు గురైన ఎమ్మెల్యేలు, స్థానచలనం కలిగిన వారు ప్లాన్ బి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లికి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలు అందరికీ స్థానచలనమో లేక టికెట్ నిరాకరణో జరగడంతో అందరూ జగన్ పై అసహనంతోనే వెనుదిరుగుతున్నారు. ఇప్పటికే ఈ గ్రూపు ఎమ్మెల్యేలంతా రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. సిట్టింగ్ ప్లేస్ లోనే గెలవలేకపోతే, ఇంకో స్థానంలో ఎలా గెలుస్తామని జగన్ అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం జగన్ తెలివితక్కువగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఎన్నికల వేడి కాస్త పెరగ్గానే వీలు చూసుకొని పక్క పార్టీలోకి జంప్ అవ్వాలని దాదాపు అందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్యేలే స్థానిక వైసీపీ అభ్యర్థులకు రెబల్ గా మారి.. వారి ఓటమికి కారణం అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న విచ్చలవిడి ప్రక్షాళనతో అపారమైన నష్టం మూటగట్టుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.