ఎన్నికల్లో ప్రజలు మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చినా వైసీపీ అధినేత జగన్ తీరు మారలేదు. మూడు రాజధానుల పిచ్చి నుంచి ఆయన ఇంకా బయటకు రాలేకపోతున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఆయన ప్రేలాపనలు మానుకోవడం లేదు. నిజానికి ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టిన ప్రధాన అంశం మూడు రాజధానుల పేరుతో జగన్ చేసిన నిర్వాకం. ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా తుగ్లక్ పాలన కొనసాగించారు జగన్. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా..ఆయన తీరు మారడం లేదు.
తాజాగా లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో ప్రెస్మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్…తాము ఎలాంటి తప్పు చేయలేదని అమరావతిపై మరోసారి తనదైన శైలిలో విషం కక్కారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా…రాజధాని కట్టడం సాధ్యం కాదన్నారు.
అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో, విజయవాడ – గుంటూరు మధ్య 500 ఎకరాల్లోనో కట్టాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. కానీ గడిచిన ఐదేళ్లలో జగన్ ఈ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదో తెలియాలి. కనీసం దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులను వేగవంతం చేసింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో అమరావతి పనులను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. కేంద్రం నుంచి పూర్తి సహకారంతో మూడేళ్లలో అమరావతికి ఓ రూపు తేవాలని శ్రమిస్తున్నారు. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బహుళ జాతి సంస్థలు, దేశంలోని టాప్ విద్యా సంస్థలు, ప్రపంచంలోని అగ్రశ్రేణి వైద్య సంస్థలతోపాటు పలు ప్రభుత్వ కంపెనీలు తమ శాఖలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి.. ఇటు, క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతిని దేశంలోనే అడ్డాగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు.. దీనికోసం ఇప్పటికే పలు టాప్ సాఫ్ట్ వేర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. 2026 జనవరి నుండి ఈ కంపెనీలు తమ శాఖలను అమరావతిలో విస్తరించనున్నాయి..
ఇటు, పలు ప్రయివేట్, ఎమ్ఎన్సీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వరల్డ్ క్లాస్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ అమరావతి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నాయి. కానీ జగన్ ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పటికీ పాడిందే పాట అన్నట్లుగా అమరావతిపై పాత పాట పాడుతున్నారు. వైసీపీలోని సీనియర్ నేతలకు పరిస్థితి అర్థమయినా జగన్కు చెప్పే స్థితిలో వాళ్లు లేరు. దీంతో జగన్ ఇంకా మూడు రాజధానుల కలలు కంటూ విహరిస్తున్నారు. ఆయన తీరు మారకపోతే 2029లో మరోసారి ప్రజలు జగన్ని తాడేపల్లిలో అడుగుపెట్టకుండా తరిమికొట్టడం ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి..











