జీఎస్టీ ఎగవేతకు బెజవాడ రైల్వేస్టేషన్ అడ్డాగా మారింది. ఏటా రూ.500 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతకు విజయవాడ రైల్వే స్టేషన్ను కేంద్రంగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఉదంతాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కోల్ కతా నుంచి విజయవాడకు 1000 పార్శిళ్ల రెడీమేడ్ దుస్తులు దిగుమతి అయ్యాయి. వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. రెడీమేడ్ దుస్తులపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. రూ.50 లక్షలు పన్నులు చెల్లించిన తరవాతే రైల్వే పార్శిల్ సర్వీస్ను ఉపయోగించుకోవాల్సి ఉంది.
అయినా ఒక్క రూపాయి టాక్సు చెల్లించకుండా వ్యాపారులు కోల్ కతా నుంచి విజయవాడకు వెయ్యి మూటల రెడీమేడ్ దుస్తులు తేగలిగారు అంటే అధికారుల అండ లేకుండా సాధ్యం కాదు. అటు కోల్ కతా రైల్వే పార్శిల్ అధికారులతో కుమ్మక్కైన వ్యాపారులు ఒక్క రూపాయి పన్నులు చెల్లించకుండా రూ.5 కోట్ల విలువైన రెడీమేడ్ దుస్తులు విజయవాడ తేగలిగారు. కానీ విజయవాడలో జీఎస్టీ అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు దాడిచేసి సరకును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో సరకు స్వాధీనం చేసుకున్న అధికారులు ఓ ప్రయివేటు గోడౌన్కు సరకు తరలించి వ్యాపారులతో బేరాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
Also Read ;- జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?
అసలు కథ ఇక్కడే మొదలైంది
విజయవాడ రైల్వే స్టేషన్ కు ముఖ్యంగా ఉత్తరాది నగరాల నుంచి రోజూ పెద్ద ఎత్తున విలువైన సరకులు దిగుమతి అవుతూ ఉంటాయి. జీఎస్టీ అధికారులు నిరంతర పర్యవేక్షణలో మాత్రమే విజయవాడ స్టేషన్ నుంచి సరకు బయటకు వెళుతుంది. అయితే వెయ్యి పార్శిల్స్ జీఎస్టీ చెల్లించకుండా తీసుకువచ్చారంటేనే అనేక అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన రెడీమేడ్ దుస్తులు స్వాధీనం చేసుకుని, మూడు రోజులు గడచినా జీఎస్టీ, పెనాల్టీ చెల్లించి సరకు విడిపించుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో సరకు నగరంలోని ఓ ప్రయివేటు గోడౌన్ కు అధికారులు తరలించారని తెలుస్తోంది.
ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. సరకును తక్కువగా చూపించి, ప్రభుత్వానికి పెద్దఎత్తున గండికొట్టేందుకు అధికారులు, వ్యాపారులు ముందే కుమ్మక్కయ్యారని సమాచారం. సాధారణంగా రూ.5కోట్ల విలువైన రెడీమేడ్ దుస్తులకు రూ.50 లక్షల జీఎస్టీతోపాటు, మరో రూ.50 లక్షలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించే బదులు అధికారులకు రూ.20 లక్షలు చెల్లించి సరకు తరలించుకుపోయేందుకు వ్యాపారులు స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందుకే సరకు పట్టుకుని మూడు రోజులు గడచినా వ్యాపారులు స్పందించలేదు. ఇక సరకు ప్రయివేటు గోడౌన్ కు తరలించారు. అంటే చేరాల్సిన చోటుకే సరకు తరలించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేత
కృష్ణా జిల్లా పరిధిలో 16 జిఎస్టీ సర్కిళ్లు ఉన్నాయి. వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వ్యాపారులు జీఎస్టీ సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా? అనే దానిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కానీ వ్యాపారులతో మిలాఖత్ అవుతున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి కొడుతున్నారు. ఏటా ఒక్క విజయవాడ సర్కిల్ లోనే వ్యాపారులు రూ.500 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వ్యాపారులకు అధికారులు కొమ్ము కాయడంతో నాలుగు జిల్లాలకు అవసరమైన దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వస్తువులు బెజవాడ రైల్వే స్టేషన్ ద్వారా చేరిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోంది. ఎప్పుడో నెలకు, రెండు నెలలకు ఓ కేసు నమోదు చేసి హడావుడి చేయడం తప్ప వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Alsao Read ;- కేంద్రంపై ఒకరు ప్రేమ.. మరొకరు పగ..










