కరోనా రెండో వేవ్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్కు అమెరికా లోని 40 ప్రముఖ ఆక్సిజన్ కంపెనీలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. భారత్కు సాయం చేసేందుకు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరాతో పాటు ఔషధ రవాణా, సాంకేతిక సాయం లాంటి అంశాల్లో తోడ్పాటు అందించనున్నాయి. ప్రాథమికంగా అత్యవసర సాయంలో భాగంగా 20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్కి పంపించేందుకు నిర్ణయించాయి.‘US-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’, ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరం అండ్ బిజినెస్ రౌండ్టేబుల్ వంటి వాణిజ్య సంఘాల పర్యవేక్షణలో ఈ సాయం అందించేందుకు నిర్ణయించినట్లు కార్యాచరణ టీం సభ్యులైన డెలాయిట్ సీఈఓ పునీత్ రెంజెన్ ప్రకటించారు. వెంటిలెటర్ల ఏర్పాటు, సరఫరాలో సాయం, పరికరాల పంపిణీ, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సహా ఇతర కీలక అంశాలతో పాటు టెక్నికల్ సాయం కూడా అందించనున్నాయి. అందులో భాగంగా కార్గో కంపెనీలు కూడా ఈ టీంలో చేరాయి. కాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలోని టాప్ 40 కంపెనీలు ఇలా టాస్క్ ఫోర్స్గా ఏర్పడడం మొదటిసారి అని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు.
సాధ్యమైనంత త్వరగా..
ఈ 40 కంపెనీల్లో రవాణా, కార్గో, బ్యాంకింగ్, ఐటీ, ఏఆర్, డేటా సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ కంపెనీలున్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా రెండురోజుల్లో ప్రాథమికంగా వెయ్యి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్కు చేరవేయనున్నాయి. మే మొదటి వారానికి 11,000 పంపాలని, మొత్తం 20వేల నుంచి 25వేల వరకు ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను పంపాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయించిందని పునీత్ రెంజెన్ ప్రకటించారు. ఇంకా అవసరమైతే కూడా అదనపు సాయం కూడా అందుతుందని, కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. వీటితోపాటు 10 లీటర్లు, 45 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మానిటరింగ్ కిట్లను దశల వారీగా పంపనున్నారు.
Also Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు
ప్రపంచం మొత్తం స్పందించాలి
అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో ఈ టాస్క్ఫోర్స్ సంప్రదింపులు జరుపుతోందని, ఎప్పటికప్పుడు కావాల్సిన సాయానికి సంబంధించి జాబితాను తీసుకుంటోందని, త్వరలోనే ఈ సంక్షోభం నుంచి భారత్ బయటపడుతుందని పునీత్ రంజెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడాలంటే ప్రపంచం మొత్తం స్పందించాలని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, సీఈఓ సుజాన్ క్లార్క్ ప్రకటించారు.
భారత్కు అమెరికా స్ట్రైక్ టీం
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు సాయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత్కు సాయం చేసేందుకు స్ట్రైక్ టీంను పంపించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా నుంచి రానున్న ప్రత్యేక టీంలో ప్రజారోగ్య నిపుణులతోపాటు లేబొరేటరీ సేవలు, నిఘా, ఎపిడెమియాలజీ, ఏఆర్, బయోఇన్ఫర్మేటిక్స్, జన్యు క్రమ నిర్ధారణ, శాంపిల్ టెస్ట్ ఎనలసిస్, ర్యాపిడ్ ఎనలసిస్ నిపుణులు ఉంటారని పేర్కొంది. ఇందుకోసం యూఎస్ఏఐడీ, అమెరికా సీడీసీ పనిచేస్తున్నాయని, భారత ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి తమ టీం పనిచేస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ఉత్పత్తి కోసం తగినంత ముడిసరుకును పంపించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.
Must Read ;- అందరి దృష్టి భారత్పై.. మోదీ పరపతికి దెబ్బ?











