(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ప్రఖ్యాతిగాంచిన విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో సోమవారం వేకువజామున ఆక్సిజన్ సరఫరా మందగించడంతో 12మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు సంఖ్య అధికారికంగా ఇంకా నిర్థారణ కావాల్సివుంది.
ఆక్సిజన్ పైపు దెబ్బతినడంతో..
మహారాజా ఆసుపత్రిలో సుమారు 290మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వీరిలో 25మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా అవుతున్న పైపు సోమవారం వేకువజామున సుమారు 3 నుంచి 3.30 గంటల సమయంలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆక్సిజన్ సరఫరా మందగించడంతో బాధితులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
హుటాహుటిన చర్యలు
ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆసుపత్రి అధికారులు, సిబ్బంది అప్రమత్తమై మృతదేహాలను విజయనగరంలోని వివిధ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించినట్లు తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో వీటిని సాధారణ మరణాలుగా చిత్రికరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
Also Read ;- ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి
ఇద్దరే మృతి చెందారు .. అదీ సాధారణంగానే : కలెక్టర్
ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదఘటన గూర్చి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎం. హరిజవహర్లాల్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. వైద్యాధికారులతో చర్చించి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఆసుపత్రిలో సాధారణంగా .. ఎప్పటిలాగానే ఇరువురు చనిపోయారని .. ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల కాదని స్పష్టం చేశారు. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మంది ఆక్సిజన్తో ఉన్నారని, కొంతమందికి ఆక్సిజన్ అందించే క్రమంలో ప్రెజర్ తక్కువ అయిందని, అంతే తప్ప ఇంకేమీ లేదని తేల్చేశారు. లోప్రెసర్ ఆక్సిజన్ సప్లయి అవ్వడం వల్ల కొంత సమస్య వచ్చినమాట వాస్తవమేనని అన్నారు. సమస్య గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వచ్చి సమీక్షించామన్నారు. విశాఖ నుంచి ఒక లారీ ఆక్సిజన్ ట్యాంకర్ వస్తోందని, ఖాళీ అయిన సిలిండర్లు ఫిల్ చేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సప్లయిలో సమస్య ఎక్కడ అన్నది విచారణ చేస్తున్నామన్నారు. ఎం ఆర్ ఆసుపత్రిలో క్రిటికల్ రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో విశాఖలో ఒక ఆసుపత్రి ఏర్పాటుకు అక్కడి కలెక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
సమస్యను పరిష్కరిస్తున్నాం : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి
కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, డీసీ హెచ్ ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడానని, వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని దృష్టికి సమస్యను తీసుకువెళ్లానని తెలిపారు. ఐసియూలో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బంది ఉందని, 15 మందిని తక్షణమే వేరొక ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదన్నారు. విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి ఈ రోగులను తక్షణమే తరలిస్తున్నామని తెలిపారు. పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంటే విశాఖకు తరలించమని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని తెలిపారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్యను కూడా పరిష్కరిస్తామని, విజయనగరం జిల్లాలోని అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి : సుజయ్ కృష్ణ రంగారావు
విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజయ్ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, వాస్తవాలని దాచే ప్రయత్నం చేయొద్దని, నిజాలు త్వరలో బయటపడతాయని అన్నారు. బాధిత కుటుంబాలు తమ వాళ్ళు ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతోనే మృతి చెందారని మీడియాలో చెబుతున్నారని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
కప్పి పుచ్చే ధోరణిలో ప్రభుత్వం : కిమిడి నాగార్జున
ఎం. ఆర్ . హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారని వార్తలు వస్తుంటే – కేవలం ఇద్దరే చనిపోయారు – అది కూడా ఆక్సిజన్ లేకపోవటం వల్ల కాదు అని డాక్టర్లు చెప్పారని ప్రభుత్వం అంటోందని విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. అదే నిజమైతే మిగిలిన బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఏంటి? జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్రమైన ఎం. ఆర్. హాస్పిటల్లో సాంకేతిక ఇబ్బంది రావటం ఏంటి? కరోనా పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ కానీ కనీసం ఒక్క సమీక్ష అయినా ఈ మధ్య కాలంలో నిర్వహించారా? నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. ప్రభుత్వం ఈ సంఘటనను కప్పి పుచ్చే ధోరణి మాని సరైన జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యయహరించాలన్నారు.
Must Read ;- బెజవాడ దుర్గగుడిలో కరోనా కల్లోలం











