కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు, ప్రతిష్టాత్మక సంస్థలు భారత్కి బాసటగా నిలిచాయి. మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఔషధ తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలను సరఫరా చేసేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. కొన్ని దేశాలు తాము సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించాయి. అదే సమయంలో చైనా ఓ వైపు సాయం చేస్తామని ప్రకటిస్తూనే భారత్కి చెందిన కార్గో విమాన సర్వీసులన్నింటినీ రద్దుచేయడంతో పాటు ఎగుమతులపై సుంకాలను విపరీతంగా పెంచింది.
అమెజాన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్, పూణె లోని PPCR తదితర సంస్థలతో చేతులు కలిపి దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. దాదాపు 8వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500 బైపీఏపీ మెషీన్లను అందించనుంది. రవాణాలోనూ సాయం అందిస్తామని ప్రకటించింది. సింగపూర్ కూడా సాయానికి ముందుకొచ్చింది. భారత్కు విమానాల ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500BPAPయంత్రాల సామగ్రిని సరఫరా చేయనుంది. అమెజాన్ ద్వారా రవాణా చేయనుంది.
భారత్కు సాయం ప్రకటించిన దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్కి 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను పంపుతున్నట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇందుకు గాను అదానీ గ్రూపు, బ్రిటీష్ కంపెనీ లిండే కెమికల్ ద్వారా ఒప్పదం కుదుర్చుకుంది. ఇప్పటికే 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్తో నాలుగు క్రయోజనిక్ ట్యాంకులు దమ్మామ్ నుంచి గుజరాత్లోని ముంద్ర పోర్టుకు చేరనున్నాయి.

భారత్కి బాసటగా అమెరికా
ఇక అగ్రదేశం అమెరికా కూడా భారత్కి బాసటగా ఉంటామని ప్రకటించింది. రెండురోజుల క్రితం భారత్కి సాయం ప్రకటించాలని సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బైడెన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో భారత్ అమెరికాకు హైడ్రాక్సీ క్లోరీఫిన్ టాబ్లెట్లను పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కు అత్యవసర సాయం అందించేందుకు వైట్ హౌస్ 24గంటల పాటు పనిచేస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. అందులో భాగంగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిఔషధ ఎగుమతులపై వెసులుబాటు కల్పించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేయనుంది. భారత్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ ధోవల్, జేక్సులివాన్ మధ్య చర్చల అనంతరం వైట్ హౌస్ ఈ ప్రకటన చేసింది. వీటితోపాటు మెడికల్ ఆక్సిజన్, కరోనా టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగపడే ఇతర ఔషధాలను కూడా సరఫరా చేయనుంది. అమెరికా నుంచి 318 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో కూడిన విమానం ఢిల్లీకి చేరింది.
సాయం చేసేందుకు ముందుకొచ్చిన గూగుల్, మైక్రోసాఫ్ట్లు
భారత్కి సాయం చేసేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్లు మందుకొచ్చాయి. గూగుల్ ఇప్పటికే రూ.135 కోట్ల సాయాన్ని ప్రకటించగా మైక్రోసాప్ట్ సాంకేతిక సాయాన్ని ప్రకటించింది. భారత్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలవుతోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ట్వీట్ చేశారు. తమ సాంతికేత సాయం ద్వార ఔషధ సరఫరాతో పాటు పలు కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించనుంది. కాగా భారత్కి రూ.135 కోట్ల ఆర్ధిక సాయం చేస్తున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యునిసెఫ్ ద్వారా ఈ నిధులు అందజేయనున్నారు.
భారత్లో ఆక్సిజన్ కొరతపై స్పందించిన ఫ్రాన్స్, బ్రిటన్తో పాటు ఐరోపా సామాఖ్య కూడా ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే 600కు పైగా ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, వెంటీలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు పంపించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ సమయంలో భారత్కు అండగా ఉంటామని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. మొత్తం 9 ఎయిర్లైన్ కంటెయినర్లలో 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లను పంపించనున్నారు.
పాకిస్థాన్ కూడా..
పాకిస్థాన్ కూడా భారత్కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్యసామగ్రి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని, ఆ దేశానికి సాయం అందించడం తమ బాధ్యత అని ఇజ్రాయిల్ విదేశాంగ ప్రతినిధి ప్రకటించారు. అయితే జర్మనీ, ఇజ్రాయిల్ దేశాల సాయానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపేందుకు ముందుకొచ్చింది.
హ్యాండిచ్చిన చైనా..
భారత్కి సాయం చేసే విషయంలో ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా..చైనా తన వక్రబుద్ధిని మరో సారి చాటుకుంది. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పాటూ ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ భారత్ దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి శీఘ్ర రవాణాకు సహకరించాల్సింది పోయి భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కార్గో విమానాలన్నింటిని 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిచువాన్ చువాన్హాంగ్ లాజిస్టిక్స్ వెల్లడించింది. అంతేకాదు.. భారత్కు పంపే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ ధరల్ని 35 నుంచి 40 శాతం పెంచడంతోపాటు రవాణా ఛార్జీలను పెంచినట్టు షాంఘై కేంద్రంగా నడిచే సినో గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది.
Must Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు











