ఏపీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ రెబల్ ఎంపీ మరో లేఖను రాశారు. ఈ లేఖలో కూలీలకు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రస్తావించారు. పనికి ఆహార పథకం కింద కూలీలకు చెల్లించాల్సిన బకాయిల గురించి మాట్లాడారు. ఎంఎన్ఈఆర్జీఏ బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా.. ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర నిధులకు సరైన లెక్కలు చెప్పే విధంగా.. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రఘురామరాజు డిమాండ్ చేశారు.
కేంద్ర నిధులు పక్కదారి
కేంద్రం మంజూరు చేసిన నిధులను సీఎం జగన్ పక్కదారి పట్టిస్తూ, కూలీలను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్వరాజ్యం కోసం మహత్మాగాంధీ ఎంతో పాటుపడ్డారని, మీలో అలాంటి లక్షణం ఒక్కటైనా కనిపించడం లేదని సెటైర్ వేశారు. పేదలకు పనికి ఆహార పథకమే ఆసరా అని, కరోనా క్లిష్ట సమయంలోనూ కూలీ పనులు చేశారని గుర్తు చేశారు. కూలీల కోసం ప్రత్యేకంగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. తమవద్ద లేవంటూ చేతులు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. గతంలో హైకోర్టు సైతం మొట్టికాయలు వేసినా.. సీఎం జగన్ కు చీమకుటినట్టుగా లేదని విమర్శించారు. కేంద్ర నిధులు ఇతర పథకాలకు మళ్లించడం వల్ల.. ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే తాను ముందుగా హెచ్చరిస్తున్నానని ఎంపీ రఘురామరాజు సూచించారు.
Must Read ;- రఘురామ అరెస్టుతో అప్రతిష్ట.. మెయిల్స్తో అభాసుపాలేనా?