మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏ2 విజయసాయిరెడ్డి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని, హత్య జరిగిన 5 గంటల తరవాత గుండెల్లో పోటుగా మార్చారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ లోపాయికారి వ్యవహారం ఎవరు నడిపారో అందిరికీ తెలుసన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిట్కు అప్పగించారని ఆయన గుర్తు చేశారు. నాడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేటి సీఎం జగన్మోహన్రెడ్డి నేడు సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.
కేసును త్వరగా తేల్చండి..
వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చాలని వైఎస్ విజయమ్మతోపాటు తాను కూడా సీబీఐ ఆఫీసు ముందు దర్నాకు సిద్దమని ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్పై కోడికత్తి కేసును నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ఐఏకు అప్పగించారని ఆయన గుర్తు చేశారు. వివేకానందరెడ్డి హత్య తరవాత శవాన్ని కడిగి, కట్లుకట్టి, నాలుగైదు గంటల తరవాత గుండెపోటు అని చెప్పడం ఏమిటని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. గుండెల్లో పోటును గుండెపోటుగా చిత్రీకరించాలని వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. వివేకానందరెడ్డి కేసును త్వరగా తేల్చాలని కేంద్ర మంత్రులను కూడా కోరతానని ఆదినారాయణరెడ్డి తిరుపతిలో చెప్పారు.
Must Read ;- వివేకా హత్యపై అన్నీ సమాధానాలున్న ప్రశ్నలే..!











