పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఉన్న పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీపై దాడి జరిగింది. దాడి జరిగాక ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రి నుంచే మమతా బెనర్జీ సందేశాలు ఇవ్వడం, తమ పార్టీవారు సంయమనం పాటించాలని కోరడం.. పలు గాయాలు అయ్యాయని చెప్పడం, మేనిఫెస్టో విడుదల కూడా ఆగింది. ఓ మహిళగా, ఓ సీఎంగా…ఇలా ఏ కోణంలో చూసినా..దాడి జరగడం గర్హనీయమే. అందుకు కారణమైన వారిని కచ్చితంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనతో పశ్చిమబెంగాల్లో రాజకీయంగా పరిస్థితి మారింది. లోకల్ ఫ్లేవర్ మరింత మిక్సైంది. గుజారాతీల రాకతోనే బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయనే చర్చకూడా కొన్నిచోట్ల మొదలైంది. ఇది బీజేపీకి మైనస్ పాయింట్ కానుంది. ఇక మమతపై దాడి ఘటనే కాదు.. అంతకు ముందు బీహార్లో నితీష్ కుమార్, ధిల్లీలో అరవింద్ కేజ్రీవాల్పైనా దాడి జరిగింది. ఏపీలో ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి ఘటన తెరపైకి వస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. ఎన్నికల ముందు ఇలా దాడులకు గురైనవారు చాలామంది వరకు సీఎం అయ్యారు. వారికి సలహాదారుగా పీకే ఉన్నారు. అది కాకతాళీయమే అయినా.. సీఎం కావడం కామన్ పాయింట్ అని చెప్పవచ్చు.
మారిన కట్టు..
మమత బెనర్జీకి తొలుత చిన్న కట్టు కట్టారు. తరువాత పెద్దకట్టు కట్టినట్టు ఫొటో విడుదలైంది. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న, పోరాట యోధురాలు ఇలా కనిపించడంపై దేశవ్యాప్తంగా కొంత సానుభూతి వచ్చిందని చెప్పవచ్చు. ఓ మహిళగా, ఓ నాయకురాలిగా అటు వామపక్షాలను ఎదుర్కోవడం, ఇప్పుడు మోదీ-అమిత్ షా ధ్వయంతో ఢీకొట్టడం సాధారణ విషయం కాదు. అదీ..అతివాద రాజకీయాలు ఎక్కువగా ఉండే పశ్చిమబెంగాల్ లాంటి చోట్ల చాలా కష్టం. అందుకే దేశంలో జయలలిత, మాయావతి, మమత బెనర్జీ లాంటివారు దేశంలోనే మహిళా రాజకీయ వేత్తల్లో మేటి జాబితాలో ఉంటారు. అలాంటి మమత ఇలాంటి కట్టుతో ఉండడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా అంత దాడి జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఒకవేళ ఆ కట్టులో ఏ మాత్రం నిజం లేకుండా.. అర్ధశతాబ్దపు రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ శైలిని సొంతం చేసుకున్న మమత..కొత్తగా జిమ్మిక్కులు చేసే వ్యూహకర్తల వల్ల ఆ వ్యవహారిక శైలిని కోల్పోవద్దని కోరేవారూ ఉన్నారు. అంటే మమతా బెనర్జీ..మమతా బెనర్జీ లాగానే ఫైరింగ్ పాలిటిక్స్ చేయాలి. ఓడినా..గెలిచినా.. మమత బెనర్జీది మాత్రం విజయమే అనే వారూ ఉన్నారు. ఇలాంటి ఎన్నికల స్టంట్లు చేసి మమత బెనర్జీ విజయం సాధించినా.. నైతికంగా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన వ్యవహారిక శైలి విషయంలో ఓడినట్టేనన్న వ్యాఖ్యలూ కనిపిస్తున్నాయి.
గతంలో ఎవరెవరిపై దాడులు జరిగాయంటే..
గతంలో ఎవరెవరిపై దాడులు జరిగాయనే విషయానికి వస్తే.. 1989లో జయలలితపై దాడి జరిగింది. అసెంబ్లీలో చర్చల సందర్భంగా డీఎంకే సభ్యులు జయలలితై దాడి చేశారు. చిరిగిన చీరతోనే జయలలిత అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి..తాను మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు.ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తరవాతి ఎన్నికల్లో జయలలిత గెలిచి సీఎం అయ్యారు. అసెంబ్లీలోనే ఈ దాడి జరిగింది కాబట్టి.. బయటి శక్తులు వచ్చే అవకాశం లేదు. డీఎంకే సభ్యులే ఇందుకు కారణమని రుజువైంది. 2013లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ రాగా ఇక్కడ ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది. ఇక గతంలో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుపై మావోల దాడి జరిగింది.
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. 2020 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2018 నవంబర్ 20వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆయన కార్యాలయం బయటే దాడి జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు.
జగన్పై దాడి..
ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై వైజాగ్ ఎయిర్పోర్టులో దాడి జరిగింది. 2018 అక్టోబర్ 25వ తేదీన జగన్పై ఓ యువకుడు కోడి కత్తితో దాడికి యత్నించాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఆసుపత్రికి తరలించి తొమ్మిది కుట్లు వేసినట్టు వైద్యులు చెప్పారు. 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్న టీడీపీ కుట్ర చేసిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించగా మీకు మీరే దాడి చేసుకుని..సానుభూతి కోసం యత్నించారని టీడీపీ ప్రతి విమర్శ చేసింది. సరిగ్గా ఇప్పుడు పశ్చిమబెంగాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు పరస్పరం ఇలాంటి ఆరోపణలే చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే ఆ ఘటనల్లో బాధితులిగా ఉన్నవారిలో అఖిలేష్, చంద్రబాబు మాత్రమే ఈ దాడుల తరువాత గెలుపొందలేదు. మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుస్తారో లేదో చూడాలి.
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. 2018లో నితీష్ కుమార్పై దాడి, 2018లోనే కేజ్రీవాల్ పై దాడి, అదే ఏడాది ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి ఘటన, ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో మమతపై దాడి ఘటనల్లో నిజానిజాలు పక్కన బెడితే.. ఆయా సమాయాల్లో సదరు పార్టీలకు సలహాదారుగా పీకే వ్యవహరించడం గమనార్హం.
Must Read : ఎలాగైనా కాషాయ జెండా ఎగరాలి.. బెంగాల్లో 7లక్షల మందితో మోదీ ర్యాలీ











