వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దందాలు ఒక్కోచోట ఒక్కోతీరుగా బయటకు వస్తున్నాయి. ఒకచోట ఎమ్మెల్యే స్వయంగా దందాలు సాగిస్తోంటే, ఒకచోట ఎమ్మెల్యే భార్య/భర్త, మరోచోట ఎమ్మెల్యే బామ్మర్ది, ఇంకోచోట ఎమ్మెల్యే అనుంగు ఆప్త మిత్రులు.. ఇలా ఎవరికి వారు ఆయా నియోజకవర్గాల్లో అధికారికిన ప్రత్యామ్నాయ కేంద్రబిందువులుగా మారుతూ.. అధికార యంత్రాంగాన్ని గుప్పిట పట్టుకుని.. దందాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దందాలు సాగిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తాకిడికి ఒక కుటుంబం యావత్తూ ఆత్మహత్య తప్ప తమకు గత్యంతరం లేదని అంటూ.. పెట్రోలు సీసా సహా ధర్నాకు దిగడం ఇప్పుడు సంచలనం అవుతోంది.
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని, కాట్రేనికొన మండలం పల్లం గ్రామంలో న్యాయం కోసం ఒక కుటుంబం నడిరోడ్డుపై పెట్రోల్ సీసాతో ధర్నాకు దిగింది. ఒక స్థల వివాదానికి సంబంధించి.. తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మల్లాడి నాగభూషణం కుటుంబం పెట్రోల్ సీసాలతో రోడ్డు ఎక్కారు.
స్థల వివాదంతోనే ప్రారంభమైన గొడవ, ఆత్మహత్య బెదిరింపులు, ధర్నాల వరకు వెళ్లింది. కాట్రేనికొన ఎస్ ఐ తమను కొట్టాడాని, దుర్భాషలు ఆడి హింసించాడని బాధితులు తెలిపారు. ఎమ్మెల్యే మేనల్లుడు దొరబాబు అండదండలతో తమను ఎస్ ఐ బెదిరిస్తున్నాడని బాధితులు మల్లాడి నాగభూషణం కుటుంబీకులు వాపోయారు.
తమకు న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని వారు బెదిరిస్తున్నారు. వారు పెట్రోలు సీసాతో ధర్నాకు దిగడంతో.. పోలీసులు జోక్యం చేసుకుని ప్రస్తుతానికి వారికి సర్దిచెప్పి పంపారు.