నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేసిన సినిమా కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో గ్రాండ్ గా చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఈ వేడుకకు ఎవరు గెస్ట్ గా వస్తారనేది సస్పెన్స్ గా ఉండేది.
ఊహించని గెస్ట్ రాబోతున్నారని గత రెండు రోజులు నుంచి వార్తలు వచ్చాయి. దీంతో ఈ సస్పెన్స్ మరింత పెరిగింది. ఇప్పుడు నిజంగానే ఊహించని గెస్టే రాబోతున్నారని ప్రకటించారు. ఆ గెస్టే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బాలకృష్ణతో అల్లు అర్జున్కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేసినప్పటి నుంచి మరింత అనుబంధం పెరిగింది. అంతే కాకుండా బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. దీంతో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ని గెస్ట్ గా పిలిచిన వెంటనే ఓకే అన్నారట.
బాలయ్య ఈవెంట్ కు బన్నీ వస్తుండడంతో ఈ ఈవెంట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించారు. ఇప్పటి వరకు బాలయ్య ఏ సినిమా రిలీజ్ కాని విధంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, ట్రైలర్కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. బాలయ్య, బోయపాటి కలిసి ఈసారి అఖండ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.











