ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… ఎక్కడున్నోళ్ల కోసమే సొంత నేలలో ఉన్నోళ్లకు ఏమైనా ఫరవా లేదన్న రీతిలోనే సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరే… అక్కడున్నోళ్లు కూడా మనోళ్లే అయినా… వారికి ఏదో జరుగుతుందని భయపడుతూ… ఇక్కడ మన కళ్ల ముందు… మన ఊళ్లలోనే ఉంటున్న ఇక్కడోళ్లను ముంచేస్తారా? జగన్ తీరు చూస్తుంటే… నిజంగానే ఈ తరహా వితండ వాదనలు రేకెత్తుతున్నాయి. మంచి పాలకుడు అయితే… పొట్ట కూటి కోసం తన ప్రాంతంలోనే ఉంటున్న తన వారికి న్యాయం చేస్తూనే… పొరుగు రాష్ట్రాలకు పొట్ట కూటి కోసం తరలిపోయిన వారిని కూడా ఆదుకుంటారు. అయితే జగన్ ఏ తరహా పాలకుడో గానీ… అక్కడెక్కడో పొరుగు రాష్ట్రంలో ఉంటున్న తన వాళ్లకు ఏదో జరగుతుందన్న భయంతో తన సొంత రాష్ట్రంలోని ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా చూస్తూ కూర్చోక తప్పదన్న రీతిలో ఆయన ముందుకు సాగుతున్నారు. బుధవారం నాటి కేబినెట్ భేటీలోనే ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్యలు వినిపించిన వైనం చూస్తుంటే… నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు.
జల వివాదంపై జగన్ మాటేమిటంటే?
జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ బుధవారం జరిగింది. ప్రస్తుతం నీటి వాటాలు, సాగు నీటి ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదంపైనే ఈ భేటీలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్… ఆసక్తికర కామెంట్లు చేశారు. జల వివాదంపై తెలంగాణకు చెందిన నేతలు… ప్రత్యేకించి టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారని ఆరోపించిన ఆయన…తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారన్న భావనతోనే తాము సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నామని, పొరుగు రాష్ట్రం కూడా అదే భావనతోనే ఉండాలని కూడా జగన్ అన్నారట. ఇక కృష్ణా జలాలపై తెలంగాణ కొనసాగిస్తున్న అన్యాయంపై మరోమారు కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కూడా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై మరింత దృష్టి సారించాల్సిందేనన్న కోణంలో… ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాయాలని జగన్ నిర్ణయించారట.
పరిణతి లేని పాలకుడిగా…
మొత్తంగా కేబినెట్ లో జగన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే… తెలంగాణలో ఉంటున్న ఏపీ వాసులకు ఏదో అవుతుందని భయపడుతూ… ఏపీలోని ప్రజలకు అన్యాయం చేయడానికి కూడా ఆయన వెనుకాడరా? అన్న దిశగా సెటైర్లు పడుతున్నాయి. ఎంతసేపు తెలంగాణలో ఉంటున్న మన వాళ్లకు ఏమవుతుందోనన్న బెంగను పక్కనపెట్టి… అక్కడి ఏపీ వారికి పూర్తి భద్రత కల్పించే దిశగా కేంద్రంతో మాట్లాడితే సరిపోతుంది కదా. అది మరిచి జల వివాదాలు రేగుతున్నా… పొరుగు రాష్ట్రం దూకుడుగా వ్యవహరిస్తున్నా… ఆ రాష్ట్రంలోని మన వాళ్లకు ఏదో అవుతుందని భయపడుతూ కూర్చుంటే… రేపు మన నీళ్ల వాటాను సాధించుకునేదెలా? కొత్తగా వచ్చే వివాదాలను పరిష్కరించుకునేదెలా? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ వాదన బేల తనాన్ని బయటపెట్టడంతో పాటుగా. పరిణతి లేని పాలకుడిగా తనకు తానే ముద్ర వేయించుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బాబు మార్కు పాలన వీరి వల్ల కాదంతే!
ఇక కేబినెట్ లో ఇతర నిర్ణయాలేమిటంటే…
# రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపిన కేబినెట్.
# నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం భారీ ప్రచార కార్యక్రమం చేపట్టాలని కెబినెట్లో నిర్ణయం.
# 9 నుంచి 12 తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాపుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.
# ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్ట గ్రామంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు ఆమోదం.
# విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్శిటీగా మార్చేందుకు అంగీకారం.
# జేఎన్టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారాన్ని తెలిపిన మంత్రి వర్గం.
# టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికి, మౌళిక సదుపాయల కల్పన కోసం రూ.
5990 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీకి కెబినెట్ అంగీకారం.
# 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్
# కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు మారిటైమ్ బోర్డుతో సంయుక్తంగా కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
# రీ సర్వేలో పట్టాదారులకు ధృవ పత్రాలు జారీ చేసేందుకు ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఆమోదం.
# విశాఖ నక్కపల్లి వద్ద హెట్రో డ్రగ్స్ సెజ్ కు ఎకరా 25 లక్షల చొప్పున 81 ఎకరాల కేటాయించేందుకు అంగీకారాన్ని తెలిపైన కేబినెట్.
# రూ. 864 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పధకంలో పుట్టపర్తి నియోజక వర్గానికి నీటి సరఫరాకు ఆమోదం.
# రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాలను కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరుకు ఆమోదం
# విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
# సత్యనారాయణ పురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు అంగీకారం.