TRS Working President KTR Viral Comments On Drugs Allegations :
తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ హీట్ మొత్తం త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల కేంద్రంగానే నెలకొన్నా.. అధికార టీఆర్ఎస్ మాత్రం అది తమకు ఓ చిన్న అంశమని చెబుతూ ఉప ఎన్నికలకు మరింతగా ప్రాధాన్యం ఇస్తోంది. ఓ వైపు బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ, మరోవైపు మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ.. తమ బలాన్ని పెంచుకుంటూ సాగుతుండగా.. ఆ రెండు పార్టీలను తిప్పికొట్టి తమ సత్తా చాటే దిశగా గులాబీ దండు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ ఆరోపణలకు కౌంటర్లు కూడా ఘాటుగానే వచ్చి పడుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్నకల్వకుంట్ల తారకరామారావుకు కూడా సంబంధాలు ఉన్నాయన్న దిశగా రేవంత్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరిద్దరూ కేటీఆర్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే.. కేటీఆర్ కు ఈ దందాతో సంబంధాలున్నాయని అర్థం వచ్చేలా ఆరోపణలు చేశారు.
కేటీఆర్ వైరల్ కామెంట్స్
విపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే సాగుతున్న కేటీఆర్.. శనివారం మీడియాతో చిట్ చాట్ లో భాగంగా డ్రగ్స్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలను ప్రస్తావించారు. అంతేకాకుండా డ్రగ్స్తో తనకు సంబంధాలున్నాయని విపక్షాలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఏమన్నారంటే.. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. టికెట్లు అమ్ముకోవడానికే రేవంత్ రెడ్డి హడావిడి చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతోంది. సీఎంను దూషిస్తే ఊరుకోం. బట్టలు ఊడదీసీ కొడతాం. మీ అక్రమ సంపాదన మాకు తెలుసు. అన్నీ బయటపెడతాం. తెలంగాణలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కన్నా ఫాస్ట్ గా న్యాయం పజరుగుతోంది. నాపై డ్రగ్స్ఆరోపణలు చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్, లివర్ టెస్ట్ ఇస్తా.. దమ్ముంటే రాహుల్ గాంధీ కూడా రావాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం అవసరమైతే రాజద్రోహం కేసులు పెడతాం’’ అంటూ కేటీఆర్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
విపక్షాలకు దమ్ముందా?
అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు తమకు అంతకంతకూ పెరుగుతున్న జనం బలం చూసి నేరుగా కేటీఆర్పైనే సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై దేశవ్యాప్తంగా రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి. కోర్టులు వద్దంటున్నా కూడా కేంద్రంతో పాటు ఏపీలోని జగన్ సర్కారు కూడా విచ్చలవిడిగా రాజద్రోహం కేసులు పెడుతున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తమపై అసత్య ఆరోపణలు చేసే వారిపై కూడా రాజద్రోహం కేసులు పెడతామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు సంధించిన రేవంత్, బండి.. వాటికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలియదు గానీ.. కేటీఆర్ అనుకున్నంత పని చేస్తే మాత్రం వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ టెస్ట్, లివర్ టెస్ట్ అంటూ కేటీఆర్ చేసిన సవాల్ కు రేవంత్, బండి ఏమంటారోనన్న వాదనపైనా ఆసక్తి నెలకొంది.
Must Read ;- కమాన్ బండి.. కేటీఆర్ రిజైన్ చేస్తారట