ఏపీలో రాజన్న రాజ్య స్థాపన కోసం రోజుకో సంక్షేమ పథకం పేరుతో నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్న జగన్ సర్కారు.. రాజకీయంగా, పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల్లో మాత్రం రివర్స్ ఫలితాలను రాబట్టుకుంటోందని చెప్పవచ్చు. 2020లో సంక్షేమ పథకాల ప్రకటనలు తప్ప.. పలు విషయాల్లో జగన్ సర్కారుకు ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. కొవిడ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, దిశ చట్టం, విద్యాదీవెన, ఆలయాలపై దాడులు, న్యాయవ్యవస్థపై ఆరోపణలు, అమరావతి ధీక్షలు, నేతల బూతు పురాణాలు, మద్యం విధానం, టాక్స్ల పెంపు, టోల్ వసూళ్లు, శాసనమండలి వ్యవహారం, స్థానిక సంస్థలకు ఎన్నికల వివాదం, పోలవరం నిర్మాణ ప్రగతి..ఇలా పలు విషయాల్లో లోపభూయిష్ట విధానాల వల్ల జగన్ అప్రతిష్టతను మూట గట్టుకోవాల్సి వచ్చిందని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతోంది.
- 2019లో కొలువు దీరిన వైఎస్ జగన్ సర్కారు ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి కనిపించింది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ చేసిన ప్రకటనలకు, అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవహరిస్తున్న తీరు పూర్తి విరుద్ధంగా ఉండడం విమర్శలకు కారణమైంది. కేసులకు భయపడి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదనే చర్చ జరుగుతోంది.
- కొవిడ్ సందర్భంగా ఆసుపత్రుల్లో సౌకర్యాల విషయంలో ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్పై పోలీసులు వ్యవహరించిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలు అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది.
- అంతర్వేది ఆలయ రథం కాలిపోవడం మొదలు..నిత్యం రాష్ట్రంలో హిందూ ఆలయాల్లో, విగ్రహాలపై దాడులు పెరిగిపోవడంతో పాటు ఇతర వర్గాల పండుగలకు అనుమతులు ఇవ్వడం, హిందువులకు సంబంధించి మాత్రమే కొవిడ్ నిబంధనల పేరుతో ఉత్సవాలను అడ్డుకోవడం గత ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వ వైఫల్యంగా భావించాల్సి ఉంటుంది.
- చారిత్రక నేపథ్యం ఉన్న మన్సాస్ ట్రస్ట్ వ్యవహారం, సింహాచలం భూముల వ్యవహారంలో పలు ఆరోపణలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
- ఇక సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై వైసీపీకి చెందిన కొందరు చేసిన వ్యాఖ్యలపై సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది
- మద్య నిషేధం పేరుతో మద్యం రేట్లను పెంచడం, గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త బ్రాండ్లు రావడం, మళ్లీ మద్యం రేట్లను తగ్గించడం లాంటి విధానాలు రివర్స్ పాలనకు నిదర్శనమనే విమర్శలు వచ్చాయి.
- కొవిడ్ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడడం, రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ జగన్ సర్కారు పోరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక మంత్రుల బూతు పురాణాలపై ఇప్పటికే రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
- ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ఆర్బాటంగా తీసుకొచ్చిన దిశ చట్టంలో ఉన్న లోపాల కారణంగా కేంద్రం ఆ బిల్లును వెనక్కి పంపడం ప్రభుత్వానికి పరాభవంగా భావించాల్సి ఉంటుంది. ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-శిక్షాస్మృతి-2019’ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే నిర్భయ-2012, ఐపీసీ-1860, సీపీసీ-1973, పోస్కో-2012 తదితర కేంద్ర చట్టాలకు దిశ చట్టంకొన్ని విషయాల్లో విరుద్ధంగా ఉందన్న కారణంతో కేంద్రం బిల్లును తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేవలం ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసి ప్రత్యేక కోర్టులకు పరిమితం కావాల్సి వచ్చింది.
- ప్రభుత్వం తాజాగా చేపట్టిన భూ సర్వేకు సంబంధించిన బిల్లుపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో ఓ సారి ఈ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది.
- ఏపీలో శాసనమండలి రద్దు వ్యవహారం విషయంలోనూ జగన్ ప్రభుత్వ వ్యవహరించిన తీరు పలు సందేహాలకు తావిస్తోంది. ఏపీ శాసనమండలి రద్దు బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. అయితే తిరుపతి ఎంపీ అనారోగ్య కారణాలతో చనిపోయిన నేపథ్యంలో ఆయన కుమారుడిని ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.
- గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ్య పన్నులో భాగంగా మరుగుడొడ్లకు పన్న విధించడం, రాష్ట్ర పరిధిలోని రోడ్లకు టోల్ వసూళ్లు, విద్యుత్తు ఛార్జీల పెంపు, నీటిపన్ను, ఆస్తి పన్ను..ఇలా అన్ని పన్నులు పెంచడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
- ఇక వాహనాలకు సంబంధించి పన్ను విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కాని ఆదాయం పెంచుకోవడం కోసం ప్రభుత్వం ఈ జరిమానాలను విపరీతంగా పెంచడడమే చర్చకు కారణంగా మారింది.
- ఇక మూడు రాజధానుల విషయంపై జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళానికి కారణమైంది. అమరావతి ధీక్షలను నీరు గార్చేలా పలు ప్రయత్నాలు జరగడం, స్థానికేతరులను తీసుకొచ్చి అమరావతికి వ్యతిరేకంగా అదే ప్రాంతంలో ఆందోళనలు చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
- అమరావతి దీక్షలకు మద్దతు ఇచ్చిన రైతులకు బేడీలు వేసిన ఘటన సర్వత్రా విమర్శలకు కారణమైంది. ఎస్సీలపైనే ఎస్సీఎస్టీ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ దీక్షల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటుందని, ప్రభుత్వం లేదా అధికార పార్టీ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
- సీఎం జగన్ 2020లోనూ పోలీసుల, తెరల రక్షణతో, పొలాల్లో పనిచేస్తున్న వారినుంచి కూడా రక్షణగా పోలీసుల బంధోబస్తుతో తన కార్యాలయానికి వెళ్లడం కూడా విమర్శలకు కారణమైంది.
- కేసీఆర్తో ఓ వైపు స్నేహంగా ఉంటూనే పలు ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పడం, ఢిల్లీ పర్యటనలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలనూ వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
- పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో టీడీపీ ప్రభుత్వంపై అంచనాలు పెంచిన విషయంలో అవినీతి ఆరోపణలు చేసింది అప్పటి ప్రతిపక్ష వైసీపీ. వైసీపీ అధికారంలోకి వచ్చాక పాత అంచనాలకే కేంద్రం మొగ్గుచూపడంతో జగన్ ప్రభుత్వం కంగుతినాల్సి వచ్చింది.
- దేశవ్యాప్తంగా మరో విషయంపై కూడా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతోపాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపైనా పలు ఆరోపణలతో ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనం రేపింది.
- ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి పలు విషయాల్లో ప్రతికూల తీర్పులే వచ్చాయి. హెబియస్ కార్పస్ ఇష్యూకి సంబంధించి ఏపీ డీజీపీని హైకోర్టు ఘాటుగా విమర్శించడం, అప్పటికే పలు కేసుల్లో ప్రభుత్వ అధికారులను హైకోర్టుకు పిలిపించడం చర్చనీయాంశమైంది.
- గతంలో టీడీపీ ప్రభుత్వంపై ఇసుక విషయంలో పలు ఆరోపణలు చేసిన వైసీపీ.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇసుక లభించకపోవడంతో పనుల్లేక ఓ మంత్రిపై దాడికి యత్నించిన ఘటన కూడా జరిగింది.
ఇలా పలు అంశాల్లో లోపభూయిష్టమైన విధానాల కారణంగా జగన్ ప్రభుత్వం 2020లో అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చింది. కేవలం నవరత్నాల పేరుతో నిధులు ఇచ్చినట్టే ఇచ్చి పన్నులు, జరిమానాలు, మద్యం రేట్ల పెంపు లాంటి చర్యలతో అంతకంటే ఎక్కువే రాబట్టుకుంటోందనే విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయాలు ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి నష్టం కలిగించకున్నా రానున్న కాలంలో తీవ్ర నష్టం కలిగించడం ఖాయమనే చర్చ నడుస్తోంది