ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై వివాదం రాజుకుంటోంది. ఆయన పర్యటన కుటుంబ కోసమే తప్ప ప్రజల కోసం కాదంటూ విమర్శిస్తోంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద అవినీతికి కేంద్రంగా కాళేశ్వరం మారిందని.. లక్షకోట్ల రూపాయాల అవినీతి జరిగిందంటూ బీజేపీ విమర్శలు చేస్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైందని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీరు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో అంశం పై చర్చించినా చివరకు కాళేశ్వరం వైపు దానిని మళ్ళించడం.. ఏదో అభివృద్ధి చేశామని చెప్పడం కామన్ గా మారిందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో మరోమారు తమ విమర్శలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు.
కాళేశ్వరం పేరుతో కోట్లు దండుకున్న కేసీఆర్ : సంజయ్..
తెలంగాణ వచ్చిన తరువాత అతి పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పాత డిజైన్ ప్రకారం ఉపయోగం లేదంటూ రివర్స్ పంపింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించ వచ్చంటూ రీ డిజైన్ చేసింది తెలంగాణ సర్కార్. దీనిపై అప్పట్లో విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. పాత డిజైన్ లోనే రూపాయి ఎక్కువ ఖర్చులేకుండా సాగునీటిని అందించే అవకాశం ఉన్నా కేవలం ఆదాయం కోసమే రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి తెరలేపాడని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తరువాత కాంట్రాక్టర్లు సైతం ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు సంపాదించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఈ అవినీతి చాలదన్నట్టు మూడో టీఎంసీకి అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతులు కోరడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విపక్ష పార్టీల నేతలు. మరో టీఎంసీ పేరుతో భారీ అవినీతిని తెరతీసే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న నీటినే రైతులకు ఇవ్వని కేసీఆర్ మూడో టీఎంసీ తీసుకు వచ్చి ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
పూజా ద్రవ్యాలను కలిపేందుకే సతీసమేతంగా కాళేశ్వరం వెళ్ళారు: సంజయ్..
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేటీఆర్ ముఖ్యమంత్రి వ్యవహారం కూడా కాళేశ్వర పర్యటనలో భాగం అంటున్నారు బండి సంజయ్. గత మూడు రోజులుగ ఫాం హౌజ్ లో శాంతి పూజలు చేసిన కేసీఆర్ ఆ ధ్రవ్యాలను కాళేశ్వరంలో కలిపారు తప్పా కాళేశ్వరంకు పూల సమర్పణ కాదంటూ స్పష్టం చేసారు. అధికారికంగా కాళేశ్వరం వెళ్ళాలనుకుంటే సతీసమేతంగా ఎందుకు వెళ్తారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఏ ఆటంకాలు రాకుండా ఉండేందుకు కాళేశ్వరం పర్యటనను ఆకస్మికంగా పెట్టుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ వేసే ప్రతి అడుగులోనూ అనుమానాలు వ్యక్తం చేసే బీజేపీ నేతలు తాజాగా ఆయన కాళేశ్వరం ప్రజెక్టు పర్యటనను కూడా ప్రజల కోసం చేసిన పర్యటన కాదని.. కుటుంబం బాగుండాలని చేసిన పర్యటనగానే చూస్తామంటూ కొత్త చర్చకు తెరలేపారు. మరి బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు ఎలా తీసుకుంటారు.. టీఆర్ఎస్ పార్టీ దీనిని ఎలా తిప్పికొడుతుందో చూడాలి.
Must Read ;- పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి.. స్వామీజీనేనా?