ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నేతలు వరుసగా బుక్కైపోతున్నారు. నిన్నటికి నిన్న ఓ మహిళతో వైసీపీ కీలక నేత, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫోన్ లో మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో ఆయనను అడ్డంగా బుక్ చేయగా.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో కీలక నేత, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కూడా బుక్కైపోయారు. అక్రమ రవాణా వ్యవహారంలో ఓ లారీని పోలీసులు పట్టుకుంటే.. దానిని వదిలిపెట్టాలని, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ నందిగం హెచ్చరించారు. నేరుగా సీఐకే వాట్సాప్ కాల్ చేసిన నందిగం.. ఆ ఫోన్ కాల్ కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో బుక్కైపోయారు.
ఆది నుంచి వివాదాలే
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి నందిగం సురేశ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఎన్నికలకు చాలా కాలం ముందే.. రాజధాని అమరావతి ప్రాంతంలో చెరుకు తోటలకు నిప్పు పెట్టిన ఘటనలో పోలీసులు నందిగంను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ నందిగం ఆరోపించారు. నాటి నుంచి వైసీపీలో ఆయన ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి సురేశ్ కు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేశ్ రాజధాని అమరావతిలోని ఓ గ్రామానికి చెందిన వారు. చెరుకు తోటలకు నిప్పు ఘటనతో లైమ్ లైట్ లోకి వచ్చిన సురేశ్ కు ఎన్నికల్లో తప్పనిసరిగా టికెట్ దక్కుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా బాపట్ల లోక్ సభ టికెట్ ను కేటాయించిన జగన్.. లోక్ సభ అభ్యర్థుల జాబితాను కూడా సురేశ్ తోనే ప్రకటించారు. ఇక ఎంపీగా గెలిచిన తర్వాత సొంత పార్టీ నేతలతోనే వివాదాలు సురేశ్ ను మరింతగా వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి.
ఫోన్ లోనే సీఐకి వార్నింగ్
ఇక సురేశ్ ఇరుక్కున్న తాజా వివాదం వియానికి వస్తే.. ప్రకాశం జిల్లా మార్టూరు పరిధిలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు కూడా ఈ వ్యవహారంపై గట్టిగానే నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మార్టూరు సమీపంలో అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్న ఓ లారీని ఇంకొల్లు సీఐ సుబ్బారావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వే బిల్లులు లేకుండానే సదరు లారీ వెళుతుండటాన్ని గమనించిన సుబ్బారావు.. లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై లారీకి చెందిన వ్యక్తులు నందిగం సురేశ్ కు సమాచారం చేరవేశారు. దీంతో వెనువెంటనే స్పందించిన నందిగం.. తన మనుషులను లైన్ లోనే పెట్టి సీఐ సుబ్బారావును కాన్ఫరెన్స్ కాల్ లోకి తీసుకున్నారు. లారీని వదిలేయాలని, కేసు బుక్ చేస్తే ఊరుకునేది లేదని నందిగం హెచ్చరించారు. అయితే అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే లారీని పట్టుకున్నామని, వే బిల్లులు కూడా లేవని సీఐ సుబ్బారావు చెప్పినా. నందిగం వినలేదు. లారీని వదిలేయాల్సిందేనని, కేసు బుక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన సీఐని హెచ్చరించారు. ఈ కాన్ఫరెన్స్ కాల్ కు సంబంధించిన ఆడియో లీక్ అయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Must Read ;- అంబటిపై హనీ ట్రాప్ విసిరిందెవరో తెలుసా?