Supreme Court Squashes Insider Petition :
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ సర్కారు చేస్తున్న వాదనలు పూర్తిగా నిరాధారమైనవేనని తేలిపోయింది. తన సొంత సామాజిక వర్గం వారికి ముందుగానే రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయాన్ని లీక్ చేయడం ద్వారా నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని, దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కారు.. హైకోర్టు ఆదేశాలను రద్దు చేసి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనిపై ఇప్పటికే ఓ పర్యాయం వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తాజాగా సోమవారం కూడా ఈ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయం సరైనదేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు ద్వారా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్న మాటే లేదని కోర్టు చెప్పినట్టైందని ఇప్పుడు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.
సీఎం కాగానే ఆదేశాలు
మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన వైనంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామని సంచలన ప్రకటన చేసిన జగన్.. అందుకు అనుగుణంగానే ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ.. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ పలువురు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో దీనిపై ఓ మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన జగన్ సర్కారు.. దాని నుంచి కూడా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నట్లుగా నివేదిక తెప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇటు మంత్రివర్గ ఉప సంఘం, మరోవైపు సీఐడీ దర్యాప్తులపై అసహనం వ్యక్తం చేసిన నిందితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. నష్టపోయిన వారు కాకుండా అమరావతి భూముల క్రయవిక్రయాలతో ఏమాత్రం సంబంధం లేని ఏపీ సర్కారు.. అక్కడేదో జరిగిందని ఎలా చెబుతుందంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో దర్యాప్తును నిలుపుదల చేయాలని కూడా కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ వాదన సమంజసంగా లేదన్న భావనతో ఈ కేసులో దర్యాప్తును నిలుపుదల చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీందీ హైకోర్టు మాటే
హైకోర్టు తీర్పుతో షాక్ తిన్న జగన్ సర్కారు.. ఈ కేసును వదిలిపెట్టేది లేదని, ఈ కేసులో అక్రమాలను నిగ్గు తేల్చి నాటి సీఎం చంద్రబాబు, ఆయనకు సహకరించిన మంత్రులను అరెస్ట్ చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు గడప తొక్కింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. బాధితులు రాకుండా బాధితుల తరఫున మూడో పార్టీగా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదని భావించింది. అంతేకాకుండా ప్రభుత్వ వాదనలను వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేపై ప్రశ్నల వర్షం కురిపించింది. నష్టపోయామంటూ ఓ ఒక్కరూ చెప్పకుండానే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎలా నిర్ధారిస్తారంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం దవేను నిలదీసినంత పనిచేసింది. మరిన్ని వాదనలను వినిపించేందుకు గత విచారణలో దవే చేసిన విజ్ఞప్తికి ఓకే చెప్పిన సుప్రీంకోర్టు.. సోమవారం ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత పిటిషన్ ను కొట్టివేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. మొత్తంగా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని స్వయంగా సర్వోన్నత న్యాయస్థానమే చెప్పినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- సీఐడీకి ఫైబర్ కేసు.. మరో భంగపాటు రెడీ