కోవిడ్ మహమ్మారి కారణంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్స్స్టిట్యూట్ రెండు వైపులా యుద్దం చేస్తోంది.ఒక వైపు క్యాన్సర్ వ్యాధిపై తన పోరాటాన్ని కొనసాగిస్తూ కరోనాతో భాదపడే రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది.దీంతో పాటు నానాటికీ పెరుగుతున్న కరోనా బాధితులకు సంబంధిత కోవిడ్ నియమాల మధ్య చికిత్స అందించడంలో ఏర్పడుతున్న ఇబ్బందులతో పాటు పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు ఆలస్యం కాకుండా చికిత్స అందించే దిశగా కొత్త వార్డులను ఏర్పాటు చేసి తద్వారా తమ బెడ్ల సంఖ్యను పెంచుకొనే దిశగా పలు చర్యలు చేపట్టింది.
బాలకృష్ణ సమీక్ష
ఈ దిశగా జరుగుతున్న పలు పనులపై బుధవారం BIACH&RI ఛైర్యన్ నందమూరి బాలకృష్ణ సంస్థ యాజమాన్యం ఇతర సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.సమావేశం తర్వాత నందమూరి బాలకృష్ణ స్వయంగా పనులు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించి వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన ఆదేశాలు, సూచనలు చేశారు.
మల్టీ డిసిప్లనరీ బ్లాక్ ఫంగస్ క్లినిక్ ఏర్పాటు
కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో పెరుగుతున్నబ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స అందించడానికి వీలుగా ప్రత్యేకమైన మల్టీ డిసిప్లనరీ బ్లాక్ ఫంగస్ క్లినిక్ ఏర్పాటు చేయాలని BIACH&RI నిర్ణయించిన నేపధ్యంలో దానిపై డా. యల్ యం చంద్ర శేఖర రావు, హెడ్ & నెక్ సర్జన్ నేతృత్వంలోని సంబంధిత వైద్యులు,సిబ్బంది,యాజమాన్య సభ్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అవసరమైన ఏర్పాట్ల గురించి తెలుసుకున్న బాలకృష్ణ ఈ క్లినిక్ నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తూ అవసరమైన మందులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకొంటామని తెలిపారు.
వైద్యులు,సిబ్బంది కృషిని ప్రశంసించిన బాలకృష్ణ
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటూ కూడా హాస్పిటల్కు వచ్చే క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించడంలో వైద్యులు,సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసించారు.హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందం,ఎమెర్జెన్సీ కేర్ వైద్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కృషిని రాబోయే రోజులలోనూ కొనసాగించాలని సిబ్బంది,వైద్యులకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ తో పాటూ డా ఆర్ వి ప్రభాక రావు,CEO, BIACH&RI, జి రవి కుమార్, COO, BIACH&RI, డా. కె ఫణికోటేశ్వర రావు,మెడికల్ సూపరింటెండెంట్, BIACH&RI కు చెందిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Must Rread ;- హిందూపురం ప్రజల శ్రేయస్సు కోసం రంగంలోకి బాలయ్య











