ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది.ఒకే రోజు దీని బారిన పడి ముగ్గురు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.కరోనా తగ్గినాక రోగులు బ్లాక్ ఫంగస్ భారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు రోజుకు సగటున 22 వేలు దాటుతున్నాయి.ఇక దీనికి బ్లాక్ ఫంగస్ కూడా తోడైంది.దీంతో జనం వణికిపోతున్నారు.గుంటూరుకు చెందిన ఓ యువకుడు,కర్నూలు జిల్లాకు చెందిన వృద్ధుడు కరోనా బారిన పడికోలుకున్నారు.ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
చికిత్స పొందుతూ మృతి
గుంటూరుకు చెందిన యువకుడు బ్లాక్ ఫంగస్ కు చికిత్స పొందుతూ శనివారం చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. తాజాగా కర్నూలుకు చెందిన మరో యువకుడు కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డాడు.చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ శనివారం మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.రెండు రోజుల కిందటే సదరు యువకుడి తండ్రి కూడా కోవిడ్ బారిన పడి చనిపోయాడు.గుంటూరుకు చెందిన మరో యువకుడు కరోనా బారిన పడి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ లక్షణాలు వెలుగు చూడటంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ శస్త్ర చికిత్స చేసి కనుగుడ్డు తొలగించినట్టు రోగి బంధువులు తెలిపారు.ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు.కోవిడ్ బారిన పడి కోలుకున్న తరవాత సదరు ప్రిన్సిపాల్ బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
స్టెరాయిడ్స్ వాడటం వల్లే..
కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్లు వాడటం వల్లే బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని ఐసీఎంఆర్ ప్రకటించింది. స్టెరైల్ నీటికి బదులు సాధారణ నీటిని అందించడం కూడా బ్లాక్ ఫంగస్కు కారణం అవుతోందని వైద్యులు గుర్తించారు. హ్యుమిడిఫయర్లేలో ఆక్సిజన్ అందించేప్పుడు స్టెరైల్ నీటినే ఉపయోగించాలి.స్టెరైల్ నీరు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఆసుపత్రుల్లో సాధారణ నల్లా నీటిని వాడుతున్నారు.కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్లు వాడటం వల్ల కూడా మ్యూకోర్ మైకోసిస్ దాడి చేస్తోందిని గుర్తించారు.దీని ప్రభావం ముందుగా కళ్లు, ముక్కు, మెదడు,పళ్లపై పడుతోంది.బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారు చూపు కోల్పోతున్నారు.దీంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగిపోతోంది.ఓ వైపు కరోనా కట్టడి కాకముందే, బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
Must Read ;- భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. తెలంగాణాలోనూ వెలుగులోకి











