గ్రేటర్ హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం సాధించుకుంటామని చెబుతున్న బీజేపీ సర్వ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఏ పార్టీ నుండి వేయనన్ని నామినేషన్లు బీజేపీ పార్టీ తరఫున ఆశావాహూలు ఫైల్ చేశారు. పార్టీ అధిష్టానం ఇప్పటికే 150 బీఫాంలు ఇచ్చేసినట్టు సమాచారం. ఇక పార్టీ ముఖ్యనేతలు రెబల్స్ను బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారు. ఉప సంహరణకు నేటి వరకు గడువు ఉండటంతో ఆశావాహులను పోటీ నుండి తప్పించే పనిలో పడ్డారు. వారికి ఇతర వ్యవహారాలు అప్పగించి ప్రాధాన్యత ఇచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో ఇంత భారీగా ఎప్పుడు ఆశావాహులు లేకపోవడం.. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Also Read:-హైదరాబాద్ మంత్రులకు గ్రేటర్ పరీక్ష
మా లెక్కలు వేరు..
ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ అన్ని విధాలుగా లెక్కలు వేసుకుని రంగంలోకి దిగుతుంది. ఉత్తర భారతంలో ఈ లెక్కలు బాగానే పని చేసినా దక్షిణ భారతంలో ఇప్పటి వరకు అంతగా ప్రభావం చూపలేదు. నేతలు కూడా సీరియస్గా దీనిపై దృష్టి పెట్టే వారు కాదు. అయితే ఈ సారి అన్ని విధాలుగా పక్కాలెక్కలతో రంగంలోకి దిగింది. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలేవి.. వీక్గా ఉన్న ప్రాంతాలేవి అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్న నేతలు బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రచారం ఉధృతం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. డివిజన్ స్థాయి నుండి ఎంపీ స్థాయి నేతల వరకు తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో పార్టీ అనూహ్యంగా బలపడుతోంది.
Also Read:-త్వరలో బీజేపీకి కన్నా గుడ్ బై ?
డెబ్బై శాతం సీట్లు మావే..
బీజేపీ గ్రేటర్ నాయకత్వం 70 శాతం సీట్ల టార్గెట్గా రంగంలోకి దిగింది. తాము కష్టపడి పని చేసిన ప్రతిచోట 70శాతం సీట్లు తమ పార్టీకే దక్కాయంటోంది బీజేపీ. ముస్లిం మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇన్ని సీట్లు తామే గెలుచుకున్నామని చెబుతున్నారు.. దీనికి సమర్ధింపుగా ఉత్తర భారతంలో ముస్లీంల ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తర ప్రదేశ్, బీహర్ రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడ ప్రభుత్వం ఏర్పాటు చేశామంటున్నారు. ముస్లిం ఓటు బ్యాంకుపై పెద్దగా టెన్షన్ పడకుండా తమ పని తాము చేసుకుపోతే గెలుపు ఖాయం అంటున్నారు. ఆ పార్టీ జాతీయ నేతలు సైతం అక్కడ విజయం దక్కినప్పుడు హైదరాబాద్లో ఎందుకు దక్కదన్న ధీమాతో ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. బండి సంజయ్ సైతం ముస్లిం ఓటు బ్యాంకు కోసం చూడకుండా తమ స్టైల్లో తాను ప్రచారం చేయడంతో పాటు శ్రేణులను అదే తరహాలో సిద్ధం చేస్తున్నారు. మరి ఉత్తర భారతంలో పని చేసిన ఫార్మలా ఇక్కడ పని చేస్తుందా.. గ్రేటర్ పీఠంపై కాషాయ జెండా ఎగురుతుందో లేదో చూడాలి.