జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు తర్వాత ఎవరైనా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి విలేకరుల సమావేశంలో తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లిపోవాలన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు.
9,101 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
గ్రేటర్లో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ముందురోజు ప్రతి పోలింగ్ కేంద్రం శానిటైజ్ చేయనున్నట్లు చెప్పారు. అత్యధికంగా కొండాపూర్ డివిజన్లో 99 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరగనుంది. వికలాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వీల్ ఛైర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1893 మంది అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్దేవ్పల్లి కాగా, చిన్న డివిజన్ ఆర్సీపురం. ఏమైనా ఫిర్యాదులుంటే 040 29555500 నెంబరులో సంప్రదించవచ్చని ఎస్ఈసీ తెలిపారు.