కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విలీనం అయిన బ్యాంకుల కార్యకలాపాలు విలీనం చేసుకున్న బ్యాంకు వేదిక (ఫ్లాట్ ఫాం)పేరుతో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని అంశాలు ఆయా బ్యాంకుల ఖాతాదారులపైనా ప్రభావం చూపున్నాయి. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్లు ఉన్నాయి. ఏప్రిల్ 1 తరువాత ఈ కార్యకలాపాల్లో కొన్ని మార్పులు రానున్నాయి.
బ్యాంకుల విలీనం ఇలా..
దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ – బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.
మారనున్న నిబంధనలు..
ఈ బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా..ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అంటే పాత బ్యాకింగ్ పాస్ వర్డ్ లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ క్రెడెన్షియల్స్, చెక్ బుక్, డెబిట్ కార్డుల్లో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నాళ్ల పాటు పాత బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ డిటైల్స్ తో లాగిన్ అయితే.. విలీనం అయిన ప్రధాన బ్యాంకుకు రీ డైరెక్ట్ అవుతుందని చెబుతున్నా..ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీటిల్లో కొన్ని బ్యాంకులు ఇప్పటికే చెక్ బుక్ల జారీని నిలిపివేశాయి. పాత చెక్ బుక్లను మార్చి 31వరకు వినియోగించుకునే వెసులు బాటు ఉంది. ఈ నిబంధనలు కరెంట్, సేవింగ్, జాయింట్ అకౌంట్ ఇలా..అన్నింటికీ వర్తిస్తాయి. వీటితోపాటు MICR కోడ్, IFSC కోడ్లూ మారనున్నాయి.
సిండికేట్ బ్యాంకు..
ఇక కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంకు తన వినియోగదారులకు కొన్నాళ్లపాటు మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం సిండికేట్ బ్యాంకు పాస్ బుక్తో బ్యాంకింగ్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు.
చేయాల్సినవి ఇవీ..
చాలా బ్యాంకులు ఇప్పటికే కేవైసీలను అప్ డేట్ చేశాయి. అందులో ఉన్న సమాచారంలో మార్పులు లేకుంటే.. ఐడీ ప్రూఫ్ , బ్యాంకు డిటైల్స్తో బ్యాంకును సంప్రదించవచ్చు. కొన్ని బ్యాంకులు చెక్ బుక్లను వెనక్కి తీసుకుని వేరే చెక్ బుక్లు జారీ చేస్తాయి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, చెక్ బుక్ తదితర అంశాలకు సంబంధించి ఏటీఎం ద్వారా అప్ డేట్ చేసుకునే వీలుంటుంది. డెబిట్ కార్డులకు సంబంధించి పోస్టు ద్వారా రిజిస్టర్ అడ్రస్ కు పంపిస్తాయి. ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అయితే..బ్యాంకును ఒకసారి సంప్రదించి వివరాలు పొందవచ్చు.
వరుస సెలవులు..
విలీనమైన బ్యాంకులతోపాటు దేశంలోని అన్ని బ్యాంకుల్లో మార్చి 27నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఆరురోజులే బ్యాంకుల్లో పూర్తి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వరుస సెలవులు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.
7రోజులు మాత్రమే..
మార్చి 26నుంచి ఏప్రిల్ 14మధ్యలో కేవలం 7రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. మిగతా 12రోజుల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. మార్చి 26న భారత్ బంద్ కాగా మార్చి 27న నాలుగవ శనివారం, మార్చి 28న ఆదివారం, మార్చి 29న హోలీ.. ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. మార్చి 30న మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇకమార్చి 31న ఆర్థిక సంవత్సరపు చివరిరోజు, ఏప్రిల్ 1న బ్యాంకుల ఆడిటింగ్, ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే పనివేళల్లో లేదా సెలవు దినాలను ఆప్షనల్ విధానంలో పనిచేసుకునే వెసులుబాటు గతంలో కల్పించారు.
గతంలో ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన సెలవు రోజున కూడా బ్యాంకులు పనిచేశాయి. ఈ సారి దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏప్రిల్ 3 బ్యాంకులు పనిచేయనుండగా ఏప్రిల్ 4 ఆదివారం, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్ జయంతి సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 6,7,8,9 తేదీల్లో బ్యాంకులు పనిచేయనుండగా ఏప్రిల్ 10న రెండవ శనివారం, ఏప్రిల్ 11 ఆదివారం బ్యాంకుల్లో సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ 12న బ్యాంకులు పనిచేయనుండగామళ్లీ ఏప్రిల్ 13న ఉగాది, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సెలవులు రానున్నాయి. ఈ తేదీలను పరిగణలోకి తీసుకుని ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం మంచిదని బ్యాంకులు చెబుతున్నాయి.
పనిచేయనున్న తేదీలు:
మార్చి 30, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6,7,8,9,12 తేదీల్లో పనిచేస్తాయి.
సెలవులు,ఖాతాదారుల సేవల బంద్:
మార్చి 26, 27, 28, 29, ఏప్రిల్ 1,2,4,5, 10, 11, 13, 14
Must Read ;- అసలేంటి బ్యాడ్ బ్యాంక్? గుడ్ సొల్యూషన్ ఇవ్వగలదా?










